పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని గులాబీ పార్టీలోనే గుసగుసలు వినిపించాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైందనే ఊహాగానాలు వినిపించాయి. కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండికూడా.. కేవలం సిద్ధిపేట నియోజకవర్గానికే పరిమితం అయ్యారు హరీష్. ఇక, ఉప ఎన్నికల్లో ఓడిపోయే చోటనే ఆయనతో ప్రచారం చేయించారని, ఇది కూడా డీఫేమ్ చేయడంలో భాగమేననే ప్రచారం జోరుగా సాగింది.
అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రభుత్వంలో హరీష్ రావుకుప్రాధాన్యత పెరిగింది. ఈటలను మంత్రివర్గం నుంచి పక్కనబెట్టిన తర్వాతనే ఈ ప్రయారిటీ పెరగడం గమనార్హం. ఆరోగ్యమంత్రి స్థానంలో కేంద్రంతో జరిగే సమావేశాల్లో హరీష్ రావు పాల్గొంటున్నారు. కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లోనూ హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. కేటీఆర్ ఆక్సీజన్ కొరత, ఇంజక్షన్ల సరఫరా వంటి అంశాలను పరిశీలిస్తుంటే.. కేంద్రంతో మాట్లాడడం.. ఇక్కడి పరిస్థితులను వివరించడం వంటివి హరీష్ చక్కబెడుతున్నారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై హరీష్ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. రోజూ బాధితుల సమాచారాన్ని తెప్పించుకోవడం కూడా చేస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్ కూ జాయింట్ బాధ్యతలు అప్పగించడంతో.. కేవలం ఈ పనుల కోసమే హరీష్ ను ముందుకు తెచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది.
అయితే.. ఇదంతా ఎందుకు అన్నప్పుడు.. ఈటల అంశాన్నే చూపిస్తున్నారు చాలా మంది. ఈటల, హరీష్ రావు సన్నిహితులు అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. పార్టీలో ఇద్దరినీ కార్నర్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఈటలను పక్కకు తప్పించిన నేపథ్యంలో.. భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురుకాకుండా.. హరీష్ కు ప్రాధాన్యం ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.