KCR: కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన అంశం.. ‘ముందస్తు ఎన్నికలు’. 2019 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లకుండా అనూహ్యంగా రాజీనామా చేసేసి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ గెలిచేశారు. నాడు కనీసం ప్రతిపక్షాలకు సర్దు కోవడానికి కూడా సమయం ఇవ్వలేదు కేసీఆర్. వాళ్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకోకుండానే.. సన్నద్ధం కాకుండానే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. నాడు మోడీ మేనియాకు ఎదురొడ్డి నిలవడం కూడా కష్టమని భావించి ముందస్తుకు వెళ్లి కేసీఆర్ విజయం సాధించారు.
kcr
అయితే ఇప్పుడు కూడా మళ్లీ అలానే వెళతారనే ప్రచారం ఉంది. కేసీఆర్ ముందస్తుకు వెళతాడని ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ హోరెత్తిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్నా కూడా వాళ్లు పాదయాత్రలు, సభలు, సమావేశాలంటూ నానా హంగామా చేసేస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో తెలియక ఇలా ఆగమాగ మవుతున్నారు.
కానీ అందరూ తలిచింది కేసీఆర్ చేయడు.. కేసీఆర్ చేసేది ఎవ్వరూ తలచరు. అదే కేసీఆర్ స్పెషాలిటీ. ఊహకందని విధంగా పనులు చేయడంలో కేసీఆర్ ను మించిన నేత లేరు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేసి చిత్తు చేసే సామర్థ్యం కేసీఆర్ సొంతం. అదే అతడిని రాజకీయాల్లో ఆరితేరిన నేతగా మలిచింది.
తాజాగా సీఎం కేసీఆర్ మరో వ్యూహాత్మక ఎత్తుగడ వేశాడు. నవంబర్ 15న వరంగల్ లో 10లక్షల మందితో విజయగర్జన సభకు నాంది పలికాడు. ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై చర్చించారు. 25 తర్వాత హుజూరాబాద్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచితీరుతామని స్పష్టం చేశారు.
అంతేకాదు.. ప్రతిపక్షాలు ఆశిస్తున్నట్టు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. రెండున్నర ఏళ్లలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించాడు. ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లాడు.