Homeజాతీయ వార్తలుKCR Maharastra : కేసీఆర్‌ మళ్లీ ఏదో పెద్ద ప్లాన్‌ వేస్తున్నాడు!

KCR Maharastra : కేసీఆర్‌ మళ్లీ ఏదో పెద్ద ప్లాన్‌ వేస్తున్నాడు!

KCR Maharastra : ప్రధాని పీఠంపై గురిపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఇప్పుడు పార్టీ విస్తరణపై సీరియస్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఖమ్మంలో నిర్వహించిన ఆవిర్భావ సభలో పెద్దగా చేరికలు లేవు. తెలంగాణ బయట మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభలో భారీగా చేరికలు జరిగితే దేశం దృష్టి బీఆర్‌ఎస్‌పై పడుతుందని భావించారు. ఈ మేరకు చేరికలకు ప్లాన్‌ చేస్తున్నారు గులాబీ బాస్‌. ఈ క్రమంలో మరాఠా నేతలతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. తన లక్ష్యాలను వివరిస్తున్నారు. వారికి తన పార్టీలో దక్కే ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ముందుగా పొరుగు రాష్ట్రాల నుంచి చేరికలను పెంచేలా వ్యూహం అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఆ రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేలా తమ విధానాలను స్పష్టం చేయటానికి సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభపై ఆసక్తి నెలకొంది.

-నాందేడ్‌ లో బీఆర్‌ఎస్‌కు ఏర్పాట్లు..
ఇక జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన తరువాత రెండో సభ మహారాష్ట్రలో జరగనుంది. నాందేడ్‌ లో జరిగే సభను పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ కోసం సర్వం సిద్ధం చేశారు. నాందేడ్‌ పట్టణంతోపాటు.. సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజులుగా అక్కడే ఉంటూ ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న తెలంగాణకు చెందిన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, నిర్మల్, నిజామాబాద్‌ నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించేందుకు చర్యలు చేపట్టారు. నాందేడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

-భారీ చేరికలు..
ముందుగా పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్‌ పెట్టిన కేసీఆర్‌ పలువురితో చర్చలు ప్రారంభించారు. నాందేడ్‌ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. మహారాష్ట్రతోపాటు చత్తీస్‌గఢ్‌ కు చెందిన పలువురు నేతలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో శనివారం భేటీ అయ్యారు. మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషా ల్‌ భోప్చే, గడ్చిరోలి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ పసుల సమ్మయ్యపోచమ్మ, రిపబ్లికన్‌ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ శంకర్‌ తదితరులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గోపాల్‌ రిషికార్‌ భారతి, మాజీ మంత్రి డాక్టర్‌ చబ్బీలాల్‌ రాత్రే, మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ మాజీ ఎంపీ బోధ్‌సింగ్‌భగత్‌ తదితరులు కూడా నాందేడ్‌ సభలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. వీరంతా శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

-జాతీయ విధానంపై స్పష్టత..
ఆదివారం తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు. ఆ తరువాత ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ నాందేడ్‌ బయల్దేరుతారు. అక్కడ ముందుగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఆ తరువాత సభ స్థలికి చేరుకుంటారు. అక్కడ పార్టీలో పలువురు నేతలు చేరనున్నారు. తరువాత కేసీఆర్‌ ప్రసంగం దాదాపు గంట సేపు కొనసాగనుంది. సభ ముగిసిన తరువాత కేసీఆర్‌ నాందేడ్‌ లో జరిగే ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. జాతీయ రాజకీయాలు.. మహారాష్ట్రలో తమ పార్టీ వైఖరి.. విధి విధానాలపై కేసీఆర స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా తెలంగాణ బయట జరుగుతున్న బీఆర్‌ఎస్‌ తొలి సభ కావటంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular