Homeజాతీయ వార్తలుKhammam BRS Meeting : ఖమ్మం సభ పేరుతో వాళ్లను నిండా ముంచిన కేసీఆర్-హరీష్

Khammam BRS Meeting : ఖమ్మం సభ పేరుతో వాళ్లను నిండా ముంచిన కేసీఆర్-హరీష్

Khammam BRS Meeting : ‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ ఇదీ కేసీఆర్ అండ్ కో నిజస్వరూపం.. చచ్చీ చెడీ.. తినీ తినక తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం.. పిల్లల చదువుల కోసం ఈఎంఐలు కడుతూ కొందరు ఒక గుంట భూమి తీసుకొని పెట్టుబడి పెట్టారు. అసలే భూ బకాసురులు ఉన్న వేళ ప్లాట్లకు హద్దులు పాతుకొని కాపు కాశారు. కానీ మన తెలంగాణ రాజ్యాధిపతి కేసీఆర్ సార్ మీటింగ్ అంటే నమ్మి ఇచ్చారు. హద్దురాళ్లున్నాయి కదా అంటే సభ కోసం తీసేస్తాం.. మళ్లీ పాతేస్తాం అని స్వయానా కేసీఆర్ మేనల్లుడు.. మంత్రి హరీష్ అభయమిచ్చాడు. దీంతో నమ్మి తమ భూములను ఖమ్మం సభకు ఇచ్చిన బాధితులు నిండా మునిగారు. కేసీఆర్ సభ ముగించి వెళ్లిపోయాడు. మాట తప్పి హరీష్ రావు జారుకున్నారు. తమ ప్లాట్లు ఏవీ మొర్రో అని ఇప్పుడు ప్రజలంతా అక్కడ గగ్గోలు పెడుతున్నారు. కేసీఆర్ ఘనంగా నిర్వహించిన ‘ఖమ్మం సభ’ మిగిల్చిన దారుణాతి దారుణాల్లో ఇదొక కోణం..

అది ఖమ్మం నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రాంతం. కొత్త కలెక్టరేట్ నిర్మాణం అయిన దగ్గర నుంచి అక్కడ కజం 20వేల నుంచి 30 వేల వరకు పలుకుతోంది.. కలెక్టరేట్ నిర్మాణం కంటే ముందుగానే అక్కడ చాలామంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు.. హద్దురాళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు వెళ్లి తమ ఫ్లాట్ లను చూసుకుంటున్నారు.. కొంతమంది బ్యాంకులో రుణాలు తీసుకొని అక్కడ ఇళ్లను నిర్మిద్దామని అనుకుంటున్నారు.. కానీ వారు ఒకటి తలిస్తే కెసిఆర్ ఒకటి తలిచారు. దీంతో ఆ స్థలాల యజమానులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

ఖమ్మం నగరంలో బుధవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ అట్టహాసంగా జరిగింది. అనుకున్న జనానికంటే తక్కువగానే వచ్చినప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకులు దానిని ఎక్కువ చేసి చెప్తున్నారు.. ఇక నమస్తే తెలంగాణ సంగతి సరేసరి.. సరే ఆ గొడవ ఎందుకు గాని… భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ నిర్వహించింది వి. వెంకటాయపాలెం గ్రామంలో… ఆ స్థలం విస్తీర్ణం మొత్తం 100 ఎకరాలు. అయితే ఆ భూమి మొత్తం పలువురికి చెందినది.. వారు కొనుగోలు చేసినప్పుడు దానిని ఫ్లాట్లుగా విభజించారు.. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. హద్దురాళ్ళను కూడా పాతారు. కానీ కలెక్టరేట్ ప్రాంతానికి ఆ స్థలం దగ్గరగా ఉండడంతో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ అక్కడ నిర్వహించాలని కేసీఆర్ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులను ఆదేశించారు.

కెసిఆర్ ఆదేశించిందే తడవుగా పలువురు నాయకులు వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించారు.. అది హద్దురాళ్ళు, రాతి స్తంభాలతో ఉండటంతో ఫ్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేసి ఒప్పించారు. హద్దురాళ్ళను, రాతి స్తంభాలను అధికారులు తొలగించారు.. ఈ పని మొత్తాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు.. అంతకంటే ముందుగానే ఈ భూమికి సంబంధించిన సైట్ మ్యాప్ ఆధారంగా ప్లాట్లు కేటాయిస్తామని అధికారులు భూమి యజమానులకు చెప్పారు.. స్థలం చెదురు తర్వాత సభ జరిగింది.. అది ముగియడం కూడా పూర్తయింది.. మొన్నటిదాకా హద్దురాళ్లతో కనిపించిన ఆ స్థలాలు ఇప్పుడు నునుపుగా మారాయి.. అంతేకాదు పాతిన రాతి స్తంభాలు కూడా నేలకూలాయి.. నాటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో తమ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియక వాటి యజమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఇక ఇక్కడ ఫ్లాట్లు కొన్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నారు. అప్పట్లో వీళ్ళు హద్దురాళ్ళు పాతుకున్నారు. కొందరైతే కంచె కూడా నిర్మించుకున్నారు.. సభ కోసం అధికారులు వీటిని మొత్తం తొలగించడంతో నాటి ఆనవాళ్ళు కనుమరుగయ్యాయి.. ఇప్పుడు ఏ ఆధారంతో ఫ్లాట్లను గుర్తించాలని వాటి యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ కోసం తమను అన్యాయం చేశారని వాపోతున్నారు. దీనిపై అధికారులను, భారత రాష్ట్ర సమితి నాయకులను కలిసినప్పటికీ కూడా తమకు సరైన న్యాయం జరగలేదని వారు ఆవేదన చెందుతున్నారు.. దేశంలో గుణాత్మక మార్పు అంటూ వీరలెవల్లో ప్రసంగం మొదలుపెట్టిన కేసీఆర్… మరీ ఈ ఫ్లాట్లలో తమ హద్దులు కోల్పోయిన యజమానులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version