Independence Day 2023: జమ్మూకశ్మీర్.. ఒకప్పుడు ఉగ్రదాడులు.. బాంబు పేలుళ్లు.. కాల్పుల మోతలతో అట్టుడికేది. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కశ్మీరీలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో అనేక మార్పులు వస్తున్నాయి. జాతీయ జెండా ఎగురవేయడానికి భయపడిన పరిస్థితుల నుంచి జాతీయ పతాకలు తయారు చేసేలే పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ కార్పెట్ల తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ తయారు చేసిన కార్పెట్లు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన కార్పెట్ నేత ఒకరు భారతదేశ మ్యాప్ను త్రివర్ణ పతాకంలో చూపే గోడకు వేలాడే కార్పెట్ను తయారు చేసి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఇటీవలే ఓ యువతి కశ్మీర్లో బైక్రైడింగ్ చేస్తూ.. థాంక్యూ మోదీజీ అంటూ తమ స్వేచ్ఛను చాటుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజగా కశ్మీరీ కార్పెట్ నేత భారత పతాకం తయారు చేయడం కశ్మీర్లో మోదీ ఆశించిన ఫలితాలు వస్తున్నాయనడానికి నిదర్శనగా నిలిచింది.
కార్పెట్ల తయారీలో ప్రత్యేకత..
అష్టెంగూ గ్రామానికి చెందిన మహ్మద్ మక్బూల్ దార్ 35 ఏళ్లుగా కార్పెట్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆజాతీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాడు.
‘నేను నా దేశం కోసం ఏదైనా విభిన్నంగా చేయాలని ఆలోచిస్తున్నాను, కాబట్టి నేను త్రివర్ణ పతాకంలో భారతదేశ పటాన్ని తయారు చేశాను. ఈ డిజైన్ను నేయడానికి నాకు రెండు నెలలు పట్టింది’ అని దార్ తన యూనిట్ ’డిలైట్ కార్పెట్ వీవర్స్’లో చెప్పాడు. యూనిట్ పేరుకు తగినట్లుగా, దార్ చేసిన క్రాఫ్ట్ పీస్ స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగిస్తుంది మరియు మాస్టర్ క్రాఫ్ట్మ్యాన్∙తన పనికి గుర్తింపును కోరుతున్నాడు.
పార్లమెంట్లో ఉంచాలని వినతి..
కాశ్మీరీ కళకు కొత్త జీవం పోసేలా కొత్త పార్లమెంటులో ఎక్కడో ఒక చోట తాను తయారు చేసిన త్రివర్ణ కార్పెట్ను ఉంచాలని దార్ కోరుకుంటున్నాడు. ఇది దేశం పట్ల తనకు ఉన్న ప్రేమ, ఆప్యాయతకు చిహ్నమని పేర్కొన్నాడు. త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని చూపించే కొత్త కార్పెట్ డిజైన్ తయారు చేస్తానని తెలిపాడు.
చేనేత కళాకారుల తరహాలో..
తెలంగాణలో చేనేత కళాకారుల తరహాలోనే కశ్మీర్కు చెందిన దార్ తన నైపుణ్యంతో అనేక కళాకృతలు తయారు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. ఇన్నాళ్లూ అశాంతి, హింసతో రగిలిన కశ్మీర్లో ఇప్పుడు శాంతి నెలకొనడంతో స్వేచ్ఛగా తాను కళాకృతులు తయారు చేస్తున్నానని అంటున్నాడు. తాను తాజ్ మహల్, చినార్ ట్రీ వంటి మరికొన్ని డిజైన్లను తయారు చేయగలిగానని, ఈసారి భారతీయ జెండాను ఎంచుకుని రూపొందించానని తెలిపాడు. అలూసా బండిపోరాకు చెందిన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యుడు రియాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, దేశం పట్ల ప్రజలకు ఉన్న ప్రేమే వారు ఇలాంటివి చేస్తున్నారని తెలిపారు. ఇది దేశవాసులకే కాదు యావత్ ప్రపంచానికి చూపించాలనుకుంటున్న వారి చేతల మాయాజాలం అని తెలిపాడు. ఇలాంటి కళాకారుల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని, ప్రోత్సహించాలని కోరారు.