ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రోజురోజు ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య నాయకత్వంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులను చేరదీస్తూ, వ్యతిరేకించేవారిపై వేటు వేశారు. ఇప్పుడు సోము వీర్రాజు పార్టీ కోసం పనిచేసే వారికే పెద్దపీట వేస్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారిని నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తున్నారు.. అయితే కన్నా వదిలేసిన మంచి నాయకులను వీర్రాజు చేరదీస్తున్నారు. ఇందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లక్ష్మీపతిరాజును సస్పెండ్ చేశారు. తాజాగా సోము వీర్రాజు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలోకి తీసుకున్నారు.
Also Read: ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తాం: జనసేన
బీజేపీలోని నాయకులు ఎవరెవరు, ఏయే ఛానల్లో డిబేట్లకు హాజరుకావాలో అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్పష్టమైన దిశానిర్దేశం చేశాడు. పార్టీ గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవాలని లేకుంటే వేటు తప్పదనే రూల్స్ను పెట్టాడు. వల్లూరి జయప్రకాశ్నారాయణ, నాగోత్ రమేశ్నాయుడు, షేక్ బాజీ, లంక దినకరన్తో పాటు మరో ఇద్దరు సాక్షి ఛానెల్లో నిర్వహించే డిబేట్లకు హాజరుకావాలని తెలిపింది.
అయితే లక్ష్మీపతిరాజు పేరు ఆ జాబితాలో లేకున్నా ఆయన సాక్షి ఛానల్లో నిర్వహించే చర్చలకు హాజరయ్యారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సాక్షి ఛానల్ చర్చలకు హాజరైనందుకు లక్ష్మీపతిరాజుకు కన్నా లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసులు అందజేశారు. అయినా ఆయన వినకపోవడంతో పాటు మరోసారి చర్చలకు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లక్ష్మీపతిరాజును సస్పెండ్ చేశారు.
Also Read: రాములమ్మా.. చల్లబడమ్మా..!
కొన్ని రోజుల కిందట పార్టీ నేత లంక దినకరన్ను సస్పెండ్ చేసిన వీర్రాజు తాజాగా లక్ష్మీపతిరాజుపై సస్పెండ్ ఎత్తివేశారు. ఆయన జెన్యూన్ గా పార్టీ కోసం వాయిస్ వినిపించారని..ఆయన సేవలు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో అనుచరుడిగా ఉన్న లంక దినకరన్పై వేటు వేసి.. వ్యతిరేకంగా ఉన్న లక్ష్మీపతిరాజును పార్టీలోకి తీసుకోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే లక్ష్మీపతిరాజు ప్రస్తుతం ఛానెల్ చర్చలకు వెళుతాడా..? వెళ్లడా..? అనే అంశం ఆసక్తిగా మారింది. ఆయనకు సోము వీర్రాజు ఏ పదవి కట్టబెడుతాడో చూడాలి.