JP Nadda- Bandi Sanjay: బండి అలా – నడ్డా ఇలా.. ధరణిపై తలోమాట!

ఇటీవల బీజేపీ తెలంగాణలో చాలా పుంజుకుంది. బండి సంజయ్‌ పగ్గాలు చేపట్టాక బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే రీతలో పార్టీని తీసుకువచ్చారు.

Written By: Raj Shekar, Updated On : June 26, 2023 1:01 pm

JP Nadda- Bandi Sanjay

Follow us on

JP Nadda- Bandi Sanjay: అంతర్గత కలహాలతో బీజేపీ ఇప్పటికే ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. అసంతృప్తుల కారణంగా కొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ నేతలు సైలెంట్‌ అయ్యారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు దూకుడు ప్రదర్శించిన టీబీజేపీ నేతలు తాజాగా మౌనం వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో వివాదాస్పద ధరణి పోర్టల్‌పై బీజేపీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడం చర్చనీయాంశమైంది. తాము అధికారంలోకి వచ్చాక ధరణిలో మార్పులు చేస్తామని తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్‌ ఇటీవల ప్రకటించారు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కమ్మక్కయ్యాయన్న ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో ఆదివారం తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా మాత్ర తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఒకే అంశంపై ఇద్దరు నేతలు చెరోరకంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తగ్గుతున్న బీజేపీ హైస్‌..
ఇటీవల బీజేపీ తెలంగాణలో చాలా పుంజుకుంది. బండి సంజయ్‌ పగ్గాలు చేపట్టాక బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే రీతలో పార్టీని తీసుకువచ్చారు. అయితే కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతలే చేజేతులా పార్టీకి వచ్చిన హైప్‌ను తొక్కేస్తున్నారు. విధానాలపై కూడా క్లారిటీ లేకపోవడం పార్టీ క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికే తగ్గుతున్న పార్టీ హైప్‌ను ఇలాంటి ఘటనలు మరింత పడిపోయేలా చేస్తున్నాయి.

ధరణే పెద్ద సమస్య..
తెలంగాణలో ధరణి ఇప్పుడు పెద్ద సమస్య. తీసేస్తామని కాంగ్రెస్‌ ఖరాఖండిగా చెబుతోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ మినహా ఇతర పార్టీలు కూడా అదే చెబుతున్నాయి. మొన్నటిదాకా బీజేపీ అదే చెప్పింది. కానీ కేసీఆర్‌ ధరణిని వ్యతిరేకించే వారిని బంగాళాఖాతంలో కలిపేయాలని బహిరంగసభల్లో పిలుపునిస్తున్నారు. ఈ ప్రభావం కనిపించిందేమో కానీ బండి సంజయ్‌ ఓ సందర్భంలో ధరణిని రద్దు చేయబోమని.. అందులో లోపాలను సవరిస్తామని ప్రకటించారు. అంతే కాదు కేసీఆర్‌ పథకాలన్నింటినీ కొనసాగిస్తామన్నారు. బండి సంజయ్‌ ప్రకటనతో ధరణి విషయంలో బీజేపీ స్టాండ్‌ మార్చుకున్నదేమో అనుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా నాగర్‌ కర్నూలులో నిర్వహించిన బహిరంగసభలో ధరణిని తీసివేయిస్తామని ప్రకటించారు. బండి సంజయ్‌ ప్రకటన తర్వాత జేపీ నడ్డా ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఓ వైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ధరణిని తీసేయమని లోపాలను సవరిస్తామని చెబుతున్నారు. మరో వైపు జాతీయ అధ్యక్షుడు తీసేస్తామని చెబుతున్నారు.

కమ్యూనికేషన్‌ గ్యాప్‌..
బీజేపీ నేతల మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఎందుకు వచ్చిందో టీ బీజేపీ నేతలకూ అంతు చిక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాల్సింది రాష్ట్ర నేతలే. విధానపరమైన నిర్ణయాలను కూడా బీజేపీ నేతలే చెప్పాలి. నడ్డాకు ఇచ్చిన స్పీచ్‌లో ధరణి అంశాన్ని రద్దు చేసే విషయలో బండి సంజయ్‌ అభిప్రాయాలు తీసుకోలేదా అన్న సందేహం వస్తోంది. ఏ పార్టీలో అయినా జాతీయ అధ్యక్షుడు చెప్పిందే కరెక్ట్‌. కాబట్టి. .. జేపీ నడ్డా చెప్పినట్లే ధరణిని రద్దు చేసే నిర్ణయం తీసుకోవాలి. అంటే.. బండి సంజయ్‌ కూడా దీనికే ఫిక్స్‌ కావాలి. జాతీయ అధ్యక్షుడి ప్రకటన నేపత్యంలో బండి తన ప్రకటన వెనక్కి తీసుకుంటారా.. లేదా చూడాలి.