గాంధీ జయంతి రోజున జనసేన తన కార్యాచరణ ప్రారంభించాలని భావిస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిని కళ్లకు కట్టేలా చేసి వాటిని మరమ్మతు చేయాలని నిర్ణయించుకుంది. మూడు రోజుల పాటు కార్యకర్తలందరు రోడ్లపైనే ఉండాలని చెబుతున్నారు. రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా, సోషల్ మీడియాలకు పంపనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే ట్యాగ్ లైన్ పెట్టి ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
ఇప్పటికే రోడ్ల తీరుపై జనసేన పక్కా సమాచారం సేకరించింది. రాష్ర్టంలో విస్తరించిన రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించాలని సూచిస్తోంది. జనసేన పార్టీ కేడర్ ఎట్టకేలకు ప్రజా సమస్యలపై స్పందించేందుకు ముందుకు రావడంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం వస్తోంది. ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నిర్ణయించడంపై అందరిలో హర్షం వ్యక్తం అవుతోంది.
పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాడేందుకు సమాయత్తం కావడం కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీ జనం మధ్య నిలబడి పోరాడుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా జనసేన కూడా జనంలోకి రాబోతోందని నాయకుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.