తెలంగాణ కాంగ్రెస్ లో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఈ కారణంగానే రెండుసార్లు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేకపోయిందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోవడం.. నాయకుల మధ్య గ్రూపు తగాదాలు.. ఎన్నికలప్పుడే సమస్యలపై హడావుడి వెరసి కాంగ్రెస్ రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా.. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో చతికిలపడిపోతోంది. కేసీఆర్-కేటీఆర్ వ్యూహాల ముందు కాంగ్రెస్ నాయకుల ఆటలు సాగడం లేదు. పేరుకు మాత్రం కాంగ్రెసులో అందరు సీనియర్లే.. సీఎం అభ్యర్థులే. కానీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీని మార్చాలని భావిస్తోంది.
పీసీసీ రేసులో చాలామంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీరిలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నల్లొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెసులోకి రావడంతో అతడికి పీసీసీ ఇస్తే ఒప్పుకునేది లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. కాంగ్రెస్ నేతకే పీసీసీ ఇవ్వాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో పీసీసీపై జగ్గారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. సీఎం సీటుకు పీసీసీ దగ్గరి దారికావడంతో ఆయన అధిష్టానం దృష్టిపడేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసులోని పరిస్థితులకు కూడా జగ్గారెడ్డి అనుకూలంగా ఉండటంతో పీసీసీ రేసులో అతడి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. అయితే తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ జగ్గారెడ్డి ట్వీస్ట్ ఇచ్చాడు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని అంటూనే.. జగ్గారెడ్డి మంత్రి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జగ్గారెడ్డి సీఎం పదవీపై ఆశలు పెట్టుకుంటే ఠాగూర్ మంత్రి వస్తుందని భరోసా ఇవ్వడంపై జిల్లా నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెసులో ఎవరూ సీఎం అయినా జగ్గారెడ్డికి మంత్రి దక్కుతుందని ఠాగూర్ అనడంపై జగ్గారెడ్డి అభిమానులు స్వాగతించగా దామెదర్ రెడ్డి అనుచరులు వ్యతిరేకించారు.