జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై విచారణలో సీబీఐ స్పష్టత కనిపించడం లేదు. రాతపూర్వక వాదనలు వినిపిస్తామని అదే పనిగా వాయిదాలు అడుగుతున్న సీబీఐ ఈసారి కూడా అదే పని చేసింది. ఈ రోజు మరోసారి విచారణకు వచ్చిన సమయంలో సీబీఐ మళ్లీ లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు గడువు కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.
నిజానికి సీబీఐ ఎలాంటి వాదనలు వినిపించుకోలేదు. పదేపదే మాట మార్చుకుంటూ వస్తోంది. గత విచారణలో లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు 10 రోజుల గడువు కోరింది. కోర్టు అంగీకరించింది. ఇప్పుడు మళ్లీ గడువు కోరింది. అసలు ఈ కేసులో అనేక వాయిదాలు సీబీఐతోనే ఏర్పడ్డాయి. మొదట పిటిషన్ వేసినప్పుడు మూడుసార్లు వాయిదాలు కోరి చివరికి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత మెరిట్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కౌంటర్ దాఖలు చేసింది.
తమకు ప్రత్యేకమైన అభిప్రాయం లేదని తెలిపింది. ఇక వాదనలు పూర్తయ్యాయి. అనుకునే సమయంలో లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపి వాయిదా అడిగింది. మళ్లీ వాయిదాకి తమకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించే ఉద్దేశం లేదని తెలిపింది. అప్పుడు కేసు వాయిదా పడింది.మళ్లీ తర్వాత వాయిదాలో లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని పది రోజుల గడువును సీబీఐ కోరింది.
ఇప్పుడు మళ్లీ సమయం కావాలని కోరింది. సీబీఐ ఇలా వాయిదాల మీద వాయిదాలుఅడగటం వెనుక ఏదో ఆంతర్యం ఉందని రఘురామ తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అటు రఘురామతో పాటు ఇటు జగన్ కూడా లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. సీబీఐ వల్లే విచారణ ఆలస్యం అవుతోంది.