Homeజాతీయ వార్తలుMahakumbh Traffic Jam: కొని తెచ్చుకున్నట్లే ఉంది కుంభమేళాకు వెళ్లిన వాళ్ల పరిస్థితి.. 300కిమీ మేర...

Mahakumbh Traffic Jam: కొని తెచ్చుకున్నట్లే ఉంది కుంభమేళాకు వెళ్లిన వాళ్ల పరిస్థితి.. 300కిమీ మేర ట్రాఫిక్ జామ్ లో నరకం

Mahakumbh Traffic Jam: గత నెల సంక్రాంతి పండుగ రోజు నుంచి మహా కుంభమేళా మొదలైన సంగతి తెలిసిందే. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. భారీ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా మహా కుంభమేళాకు వెళ్లే వేలాది మంది భక్తులు రహదారులపై తిండి నీళ్లు లేక నానాయాతన పడుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం, నిలిచిపోయిన వాహనాల క్యూ 300 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. వసంత పంచమి నాడు అమృత స్నాన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మరణాల తరువాత ఇప్పుడు కుంభమేళాలో జనసమూహం తగ్గవచ్చని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి విరుద్ధంగా కనిపిస్తోందిజ ఎందుకంటే ప్రతిరోజూ లక్షలాది మంది పవిత్ర స్నానం కోసం ప్రయాగ్‌రాజ్ వైపు వెళుతున్నారు.

ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టమని భావించిన పోలీసులు, యుపి, పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సమాచారం ప్రకారం.. “ఈ రోజు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లడం అసాధ్యం ఎందుకంటే 200-300 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఉంది” అని పోలీసులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రద్దీ కారణంగా ఈ జామ్ ఏర్పడిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రేవా జోన్) సాకేత్ ప్రకాష్ పాండే తెలిపారు. కొన్ని రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని, ప్రయాగ్‌రాజ్ పరిపాలన సమన్వయంతో మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నట్లు ఆయన అన్నారు. “వాహనాలు 48 గంటలుగా నిలిచిపోయాయని చెబుతున్నారు. 50 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి దాదాపు 10 నుండి 12 గంటలు పడుతోంది.’’ అని ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక వ్యక్తి తెలిపారు.

వారణాసి, లక్నో, కాన్పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వెళ్లే మార్గాల్లో 25 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుంభమేళా జరుగుతున్న నగరం లోపల కూడా దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవునా జనసందోహం నెలకొంది. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు రద్దీలో చిక్కుకున్నారు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ.. జాతర స్థలానికి పెద్ద సంఖ్యలో వాహనాలు చేరుకోవడమే ఈ జామ్‌కు కారణమని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి, ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రయాగ్‌రాజ్ జంక్షన్ మూసివేశారని ప్రచారం జరుగుతుంది. ప్రయాగ్‌రాజ్ సంగం స్టేషన్ వెలుపల భారీ రద్దీ కారణంగా, ప్రయాణీకులు స్టేషన్ నుండి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని దానిని మూసివేయాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారి కుల్దీప్ తివారీ తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే ప్రయాణికులు భయపడవద్దని రైల్వేలు స్పష్టం చేశాయి. మహా కుంభమేళా దృష్ట్యా, సాధారణ , ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ నగరంలో సంగం స్టేషన్‌తో సహా మొత్తం 9 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దీనితో పాటు ప్రయాగ్‌రాజ్ సంగం స్టేషన్ మినహా మిగిలిన ఎనిమిది స్టేషన్ల నుండి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నట్లు రైల్వే స్పష్టం చేసింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular