Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుకుంది. కాంగ్రెస్, బీజేపీలూ తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందిన ఖేడ్, పాలేరులో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో నిలిపి విజయం సాధించింది. అందుకే ఈసారి కాంగ్రెస్ కూడా దుబ్బాకలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరుతామని ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఎలాంటి స్పష్టత లేకున్నా ప్రధానంగా మాజీ ఎంపీ విజయశాంతి పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎం.నాగేశ్వరరావు కూడా ఈసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేనట్లు తెలుస్తోంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా పేరు కూడా తెరమీదకు వస్తోంది. బీజేపీ తరఫున పోటీ చేయడానికి రఘునందన్రావు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దూకారు. వీరికి తోడు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులూ కదనరంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు.
దుబ్బాక ఉప ఎన్నికలో విజయం తథ్యమని మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ భరోసాతో ఉంది. దీర్ఘకాలం పాటు ఆ నియోజకవర్గంలో రామలింగారెడ్డి గెలవడం.. ఇప్పుడు సానుభూతి పవనాలు కూడా వీస్తాయనే ధీమాతో ఉంది. రామలింగారెడ్డి కుటుంబంలోనే ఒకరికి టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుమారుడు సతీశ్కే దాదాపు ఖాయమనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డి కూడా ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే ఆయన కాంగ్రెస్లోకి జంప్ అయి ఆ పార్టీ నుంచి టికెట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్. మంత్రి హరీశ్రావు ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈసారి టీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడకలా అన్నట్లు ఏం కనిపించడం లేదు. ప్రతిపక్షాలు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. దీనికితోడు రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మీద ఇంతో అంతో రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇది గత లోక్సభ ఎన్నికల్లోనూ వెల్లడైంది.
Also Read : కేసీఆర్ ఇమేజ్ ముందు బీజేపీ నిలిచేనా
హుజూర్నగర్లో ఇష్టమున్నట్లు డబ్బులు వెదజల్లి టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో విజయం సాధించిందనేది అందరికీ తెలిసిందే. కానీ.. ఈసారి దుబ్బాకను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక ఇండిపెండెంట్ల విషయానికి వస్తే బిగ్బాస్ ఫేం కత్తి కార్తీక ఇప్పటికే ప్రచారంలోకి దిగారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏది ఏమైనా ఈసారి దుబ్బాక నియోజకవర్గం మీదనే రాష్ట్ర ప్రజల చూపు ఉంది. అధికార పార్టీ గెలిచి తీరుతుందా..? ప్రతిపక్షాలు పాగా వేస్తాయా..? అనే ఆసక్తి నెలకొంది. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వేడెక్కింది.