bjp etela rajendar
ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీ నాయకుడు. అయితే.. ఆయన్ను అనివార్య పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకువచ్చారనే అభిప్రాయం ఉంది. ఆయన రాక కొందరు సీనియర్లకు ఇష్టం లేదని కూడా అంటారు. పెద్దిరెడ్డి వంటివారు బహిరంగంగానే వ్యతిరేకించి పార్టీని వీడారు కూడా. మిగిలిన సీనియర్లలో కొందరు అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ నుంచి ఆయనకు సరైన సహకారం అందట్లేదని అంటున్నారు.
హుజూరాబాద్ లో ఈటల వెంట పెద్ద నాయకులు ఎవరూ కనిపించకపోవడమే ఈ ప్రచారానికి కారణమవుతోంది. నిజానికి బీజేపీలో చేరిన మరుసటి రోజు నుంచి ఈటల నియోజకవర్గంలో ప్రచారానికి తెరతీశారు. పాదయాత్ర చేపట్టి పలు గ్రామాల్లో తిరిగారు. ఈ సమయంలో పెద్ద నేతలు ఎవరూ ఆయన వెంట కనిపించలేదు. ఆయనకు మద్దతుగా తిరిగింది లేదు. ఈ యాత్రలోనే ఆయన మోకాలి గాయానికి గురవడం, యాత్ర ఆగిపోవడం తెలిసిందే.
మరి, ఇప్పుడు ఈటల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అటు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 9 నుంచే ప్రారంభించాలని కూడా అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి యాత్రకు సిద్ధమవడంతో.. బండికి బ్రేక్ పడింది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్రకు సిద్ధమవుతున్నారు. దీంతో.. సీనియర్ల ఫోకస్ మొత్తం ఈ యాత్రపైనే ఉండనుంది.
ఈ యాత్ర తర్వాత బండి సంజయ్ యాత్ర మొదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. సీరియస్ కార్యక్రమాలేవీ లేనప్పుడే ఈటల వెంట బీజేపీ సీనియర్లు ఎవరూ కనిపించలేదు. అలాంటిది..ఈ యాత్రలు మొదలైతే ఈటల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి ఉంటుందా అన్నది సందేహం. మరోవైపు రాష్ట్ర బీజేపీలో వర్గపోరు కొనసాగుతోందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఈటల ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఆయన వెంట సీనియర్లు ఉండకపోవడానికి ఇది కూడా కారణమని అంటున్నారు.
దీంతో.. హుజూరాబాద్ యుద్ధంలో ఎటు చూసినా ఈటల ఒక్కడే కనిపిస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతంగానే ప్రచారం చేసుకుంటూ గెలుపుకోసం ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. మరి, ఈ పరిస్థితి ఉప ఎన్నికలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాలి.