ఉద్యోగాల ప్రకటన ఎన్నికల జిమ్మిక్కేనా?

తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. అదిగో ఇదిగో అంటూ దోబూచులాడుతున్నారు తప్ప ఆచరణలో చూపడం లేదు. ఫలితంగా లక్షలాది మంది ఆశలు అడియాశలే అవుతున్నాయి. త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూ ఊరిస్తున్నా మోక్షం లభించడం లేదు. ఫలితంగా వారిలో ఏళ్లకేళ్లు ఎదురుచూపులే మిగులుతున్నాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీల వివరాలు అసమగ్రంగా ఉన్నాయని చెబుతున్నారు. మరోసారి సాగదీసే […]

Written By: Srinivas, Updated On : July 15, 2021 4:42 pm
Follow us on

తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. అదిగో ఇదిగో అంటూ దోబూచులాడుతున్నారు తప్ప ఆచరణలో చూపడం లేదు. ఫలితంగా లక్షలాది మంది ఆశలు అడియాశలే అవుతున్నాయి. త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూ ఊరిస్తున్నా మోక్షం లభించడం లేదు. ఫలితంగా వారిలో ఏళ్లకేళ్లు ఎదురుచూపులే మిగులుతున్నాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీల వివరాలు అసమగ్రంగా ఉన్నాయని చెబుతున్నారు. మరోసారి సాగదీసే ప్రయత్నమే చేస్తున్నారు. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి రగులుతోంది.

ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులు ఇప్పటికే విసిగిపోయారు. కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరేలా లేవని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోతోంది. కాలయాపనే వారికి ఆయుధంగా కనిపిస్తోంది. ప్రతిసారి ఏదో ఓ సాకు చూపుతూ వాయిదాలు వేయడం కొత్తేమీ కాదు. ఏడేళ్లుగా ఇదే తంతు. అదిగో ఉద్యోగాలు అంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటోంది.

ఇటీవల నిరుద్యోగుల సమస్య తీర్చాలని 50 వేల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం ప్రకటించి నిరుద్యోగుల్లో ఆశలు కల్పించారు. మూడు నాలుగు రోజుల్లో ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ వస్తుందని భావించారు. కానీ వారి ఆశలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు మళ్లీ సన్నగిల్లుతున్నాయి.

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు సమగ్రంగా లేవని పేర్కొన్నారు. మరో ఐదురోజుల్లో మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని కమిటీకి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. దీంతో కొలువుల భర్తీపై మళ్లీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కేబినెట్ సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. వరుసగా రెండు రోజులు నిర్వహించినా ఏం ఫలితం లేకుండా పోయింది. ఈసారి ఓ కొలిక్కి వస్తుందని భావించినా అది వట్టిదే అని తేలిపోయింది.

నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం ఎన్నికల స్టంటుగానే అభివర్ణిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగులను తమ వైపు తప్పుకోవడానికే ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు పూనుకుంటుందని చెబుతున్నారు. ఎన్నికల కోసమే కొలువుల నాటకాన్ని తెరమీదకు తెచ్చిందని ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటే చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతోందన్నారు.