Mumbai Heavy Rains: అది మామూలు వాన కాదు.. జడివాన.. ప్రచండమైన వాన.. ఊరును మొత్తం ముంచేసేవాన. ఆకాశానికి చిల్లి పడినట్టు.. మేఘాలు మొత్తం ఒక్కసారిగా కరిగిపోయినట్టు కురిసింది. వర్షం తాకిడికి వరద కాదు.. ఏకంగా సునామీనే వచ్చినట్టుగా ఉంది. లోతట్టు ప్రాంతాలు కాదు.. ఎత్తైన ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చెట్లు కూలిపోయాయి. కొండల మీద ఉన్న రాళ్లు కింద పడిపోయాయి. పెద్ద పెద్ద భవంతుల్లోకి కూడా నీళ్లు వచ్చి చేరాయి. ఇదంతా నిరుడు కురిసిన వర్షం గురించి కాదు.. ఈ ఏడాది నమోదైన వర్షపాతం గురించి..
అదేంటి ప్రస్తుతం ఎల్ నీనో ఉందని అంటున్నారు కదా.. అందువల్లే కదా వర్షాలు కురవడం లేదు.. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఇంతవరకు పంటలు కూడా సాగు చేయలేదు. పైగా ఎండా కాలాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇలాంటప్పుడు వర్షాలు పడుతున్నాయని మీరు ఎలా అంటున్నారు.. అనే ప్రశ్న మీలో వ్యక్తమౌతుంది కదూ. అయితే ఈ వర్షాలు కురుస్తున్న తీరు మాత్రం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ వర్షాకాలంలో ఇంతవరకు తొలి సీజన్ వర్షం పడలేదు. కానీ మంగళవారం అక్కడ బీభత్సంగా వర్షం పడింది. బుధవారం కూడా వర్షం కురిసింది. ఆ వర్షం కూడా ఒక రేంజ్ లో పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ముంబై నగరం తడిసి ముద్దయింది. చాలావరకు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాలలో రైల్వేస్టేషన్లోకి నీళ్లు వచ్చి చేరాయి. అంతేకాదు కొన్నిచోట్ల రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయాయి. కేవలం 24 గంటల వ్యవధిలో ముంబై నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అంటే మామూలు విషయం కాదు. ముంబై.. తానే.. రాయిగడ్.. పాల్గర్.. సింధు దుర్గ్ వంటి జిల్లాలలో విపరీతంగా వర్షం కురిసింది. ఏకంగా అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ముంబై మాత్రమే కాదు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా విపరీతంగా వర్షం కురుస్తుంది. ఈ సీజన్లో ఇంతవరకు అక్కడ ఆశించిన స్థాయిలో వర్షం కురువలేదు. కానీ గడిచిన రెండు రోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం అయితే బీభత్సంగా వర్షం కురిసింది. బుధవారం కూడా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు తీవ్రతకి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద ప్రవాహానికి చెట్లు కొట్టుకొని వస్తున్నాయి. కొండ ప్రాంతాలలో చరియలు విరిగిపడిపోతున్నాయి.
దేశంలో క్షామ పరిస్థితులు నెలకొంటే.. ఇక్కడ మాత్రం వర్షాలు కురవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే క్లౌడ్ బరస్ట్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుందని అధికారులు అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ సాగుతోంది. అనుకూలంగా ఉన్నచోట ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా వర్షాలు కురిసినంత మాత్రాన ఎల్ నీనో ప్రభావం తొలగిపోయినట్టు కాదని.. దాని ప్రభావం అలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
