India Heatwave 2026: ప్రస్తుత వేసవి కేవలం ఉష్ణ తరంగం కాదు. వాతావరణ మార్పుల ఫలితంగా మన దేశం ఎదుర్కొంటున్న ఒక పెను సంకేతంగా కనిపిస్తోంది. వేడి గాలులు మున్ముందు మరింత తీవ్రం కానున్నాయి. రోజుల తరబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల దగ్గర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే, వాతావరణం కేవలం వార్తగా మిగలకుండా, ఆరోగ్యం, నీరు, జీవనోపాధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పై ఒత్తిడి పెంచే సంక్షోభంగా మారుతోంది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కేవలం రాష్ట్ర స్థాయి చొరవలు కాదు, కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో జాతీయ కార్యాచరణ అవసరం.
ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం..
ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, 1850–1900 కాలం నాటి సగటుకన్నా 2025లో భూమి ఉష్ణోగ్రత దాదాపు 1.43 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగింది. ఈ పెరుగుదల తో పాటు గడచిన రెండు దశాబ్దాల్లో విద్యుత్–ఇంధన వినియోగానికి 18 రెట్ల ఉష్ణాన్ని సముద్రాలు శోషించడం వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది. పర్వత హిమనదాలు కూడా ఎండి పోతున్నాయి. ఈ ప్రపంచీకరణ ధోరణి భారతదేశంపై కూడా గణనీయంగా ప్రతిఫలిస్తోంది. ఆసియా ఖండం ప్రపంచ సరాసరి కన్నా రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. దక్షిణాసియా ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా గుర్తించబడింది.
భారత్లో ఉష్ణోగ్రతల పెరుగుదల..
భారత్లో 1901–1930 కాలం నాటి సగటుతో పోలిస్తే 2015–2024 మధ్య సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.9 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రాంతాల్లో ప్రతి దశాబ్దానికి సుమారు 0.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. దేశవ్యాప్తంగా అత్యంత వేడి రోజులు దశాబ్దానికి 5–10 రోజుల చొప్పున పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల వల్ల మొదటి రోజులు మాత్రమే అత్యంత వేడి అనుభవించే ప్రాంతాల్లో ఇప్పుడు రోజుల తరబడి తీవ్రమైన వడగాడ్పులు విరుచుకుపడుతున్నాయి. 2010లో ప్రపంచంలో 23 శాతం జనాభా అత్యంత వేడి ప్రాంతాల్లో ఉండగా, ప్రపంచం రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడెక్కితే 2050 నాటికి ఆ భాగం దాదాపు 41 శాతానికి చేరి, 3.79 బిలియన్ మంది ప్రభావితం అవుతారని ఆక్స్ఫర్డ్ పరిశోధన హెచ్చరిస్తోంది. భారత్ ఇందులో ప్రధాన దేశాల్లో ఒకటిగా కనిపిస్తోంది.
దక్షిణాసియా ప్రధాన లక్ష్యంగా ..
దక్షిణాసియా ప్రపంచ సరాసరి కన్నా రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. 1990–2021 మధ్య అధిక ఉష్ణ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో సగానికి పైగా ఆసియాలోనే చోటు చేసుకున్నాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, 2030 నాటికి దక్షిణాసియా జనాభాలో 90 శాతం ప్రజలు తీవ్రమైన ఉష్ణ పరిస్థితులను ఎదుర్కొంటారు. భారత్లో దాదాపు 57 శాతం జిల్లాలు ఇప్పటికే అత్యంత వేడి వల్ల ఒత్తిడికి గురవుతున్నాయి. హిమాలయాల ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది వాతావరణం మార్పుల పరిధి కేవలం తీర ప్రాంతాలకు పరిమితం కాదని సూచిస్తోంది.
అధిక ఉష్ణం కార్మికులు, రైతులు, వృద్ధులు, పిల్లలు, కూలీలు, అల్పాదాయ కుటుంబాలను ప్రత్యక్షంగా దెబ్బ తీస్తోంది. డీహైడ్రేషన్, అవయవాల ఒత్తిడి, నిద్రలేమి, ఉత్పాదకత తగ్గుదల, వ్యవసాయ నష్టం, విద్యుత్–ఆరోగ్య వ్యవస్థలపై భారం పడుతుంది.