Jagan on local body elections: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త పాచిక వేశారు. ఎక్కడ ఏకగ్రీవాలు అనే మాట లేకుండా చూడాలని చూస్తున్నారు. పొరపాటున ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలపై వేటు వేస్తానని హెచ్చరించారు. తద్వారా ఎక్కడ పార్టీ నేతలు తప్పించుకోకుండా ఉండేందుకు ముందుగానే వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ప్రజలు కూడా ఎక్కువగా ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే స్థానికంగా రాజకీయ అంశాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గ్రామ పెద్దల ప్రమేయంతో చాలాచోట్ల ఏకగ్రీవాల వైపే చూస్తారు. ముఖ్యంగా పంచాయతీలకు ఏకగ్రీవాలు అనేవి సర్వసాధారణం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవం అన్న మాట వినిపించకూడదు అంటూ సొంత పార్టీ నేతలను హెచ్చరించడం బ్లాక్మెయిలింగ్ కిందకి వస్తుంది.
అప్పట్లో ఏకగ్రీవాలే అధికం..
2021లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మండలం మొత్తానికి ఒకే పదవిగా ఉండే జడ్పిటిసిలను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. పంచాయితీల గురించి చెప్పనవసరం లేదు. ఇక ఎంపీటీసీల గురించి చెప్పనవసరం లేదు. అన్ని ఏకగ్రీవాలే. ఎందుకంటే అధికార పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నిరసిస్తూ ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించారు చంద్రబాబు. అప్పట్లో అంతలా ఉండేది ఏకగ్రీవాల పర్వం. ఒక అధికారాన్ని చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లాక ఏకగ్రీవాలు వద్దు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ రీతిలో ఏకగ్రీవాలను చేసుకుందో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అయితే ఆయన తెలివిగా ఇప్పుడు ఆ బాధ్యతను నియోజకవర్గం అప్పగించారు. అంటే తప్పకుండా పోటీ ఉంటే పార్టీ ఓటు బ్యాంకు ఎటు వెళ్లదన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అయితే దీనిని ఎక్కువ మంది వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే మనిషి ఏకగ్రీవాలు చేయమన్నారు. ఇప్పుడు ఏకగ్రీవాలు అంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇది ఎక్కడి చోద్యం అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.
కేవలం ఆ అజెండాతో..
ఈరోజు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అధికార పార్టీ మహానాడు నిర్వహిస్తున్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడిపోతుందన్న వార్త ఉంది. అదే అజెండాతో ఈరోజు సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి.. స్థానిక సంస్థల నిర్వహణ బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జిలే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో? తమకే వస్తుందో లేదో? అనే ఆలోచనలో ఉన్నారు కొందరు ఇన్చార్జిలు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్లాంటివారు అయితే అసలు యాక్టివ్ కాలేదు. అటువంటి వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు తమను కమిట్మెంట్ చేయడం పై ఆగ్రహంగా ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
