Homeజాతీయ వార్తలుTelangana Politics: చట్టం చుట్టమైంది.. తెలంగాణలో సైలెంట్ అయిపోయింది!

Telangana Politics: చట్టం చుట్టమైంది.. తెలంగాణలో సైలెంట్ అయిపోయింది!

Telangana Politics: చట్టం… పేద ధనిక, స్త్రీ పురుష, కుల మతాల బేధం లేకుండా అందరికీ ఒకేరకంగా పనిచేయాలి. ఇందుకోసం ప్రభుత్వాలు రూపొందించేవే ఈ చట్టాలు. ప్రజల కోసం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణ కోసం, శాంతిభద్రత పరిరక్షణకు, అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు ఇలా అనేక రకాల నేరాల నియంత్రణకు ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. అయితే ఈ చట్టాలు దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటే.. తెలంగాణలో ఒకలా అమలవుతున్నాయి. తెలంగాణలో 2014 నుంచి చట్టాలు రాజకీయ పార్టీలకు చుట్టంలా మారాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే చట్టం తన పని తాను చేసుకుపోవడం ఎప్పుడో మానేసింది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చెప్పు చేతల్లో నడుస్తోంది. చట్టానికి పాలకులే దిశానిర్దేశం చేస్తున్నారు. ఐనవారికి ఒకలా.. కానివారికి మరోలా అమలవుతోంది.

2009 నుంచే మార్పు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో ప్రభుత్వ హయాం నుంచే పోలీసుల్లో మార్పు మొదలైంది. చట్టాలు వాటి పని అవి చేసుకోవడం తగ్గించాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నాటి ఆంధ్రా పాలకులు ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి పాలకులు పోలీసులను ప్రయోగించారు. మావోయిస్టులతో చర్చల పేరుతో పిలిపించి తర్వాత కీలక నేతలను ఎన్‌కౌంటర్‌ చేయించినట్లు కూడా ప్రచారం జరిగింది. ఉద్యమకారులపై అయితే అనేక కేసులు పెట్టారు.

2014 నుంచి పూర్తిగా అధికార పార్టీ చేతుల్లోకి..
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో చట్టాలు పూర్తిగా అధికార పార్టీకి చుట్టంగా మారాయి. ఓటుకు నోటు కేసు నుంచి మొదలు మొన్నటి టీఎస్‌పీఎస్సీ కేసు వరకు అన్నీ.. అధికార పార్టీ కనుసన్నల్లోనే విచారణ జరుగుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగానే పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు స్వేచ్ఛగా పనిచేయడం దాదాపు మర్చిపోయారు.

అటకెక్కిన ఓటుకు నోటు కేసు
ఓటుకు నోటు కేసు అటకెక్కింది. కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ట్రాప్‌ చేయించారు. కానీ తర్వాత దాని విచారణ మందగించింది. వాయిస్‌ రికార్డులు, డబ్బులు దొరికినా నిరూపించలేదు.

నయీం కేసు అంతే..
ఇక నయీం ఎన్‌కౌంటర్‌ కేసు కూడా అంతే.. ఎన్‌కౌంటర్‌ తర్వాత అక్రమాలు బయటకు వస్తాయని, పేదలకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ రాజకీయ పార్టీల విమర్శలకే పరిమితమైంది. విచారణ ముందుకు సాగడం లేదు. కాదు కాదు సాగనివ్వడం లేదు.

ఎమ్మెల్యేల కొనుగోలు..
తాజాగా మోయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశం బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చిచ్చు పెట్టింది. చివరకు కోర్టుల జోక్యంతో విచారణ నిలిచిపోయింది.

టీఎస్‌పీఎస్సీ కేసు..
మొన్నటి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌ కేసు కూడా అంతే.. విచారణ జరుపుతున్నట్లు కనిపిస్తున్నా అసలు దోషుల మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. పరీక్ష రాసినవారిని పట్టుకొచ్చి.. అరెస్ట్‌ చేస్తున్నామని పోలీసులు మీడియాకు చెబుతున్నారు. కానీ లీకేజీ దోషులను మాత్రం ఇంత వరకు పట్టుకోలేదు. మరోవైపు మొదట అరెస్ట్‌ అయిన వారు బెయిల్‌పై బయటకు వస్తున్నారుకూడా..

ఇలా చట్టాలు స్వేచ్ఛగా పనిచేయడం మానేసి దశాబ్దం దాటింది. ఇప్పుడు ఇదే ప్రజలకు శాపంగా మారుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular