Hyderabad Metro Rail
Hyderabad Metro Rail: రాజధానిలో హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా మెట్రో ప్రయాణికులకు మెట్రో రైల్ అధికారులలు శుభవార్త తెలిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించారు.
మొదలైన నిమజ్జన సందడి..
హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవ కోలాహలం ఇప్పటికే మొదలైంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనంకోసం సాగనంపుతున్నారు. బైబై గణేశా.. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ భక్తులు గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం వరకు ముగియనుంది. అయితే, నగరంలో రేపు ఉదయం వరకు గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో నగర వాసుల ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రయాణికులకోసం మెట్రో రైళ్లు నపడనున్నారు.
అర్ధరాత్రి 1 గంట వరకు రైళ్లు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు. గురువారం అర్థరాత్రి 1 గంట వరకు రైళ్లను హైదరాబాద్ మెట్రో నడపనుంది. రాత్రి 2 గంటలకు ఆయా రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఇందుకోసం ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. డిమాండ్ను బట్టి ఆయా మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
29న పాత టైమింగ్సే..
ఇదిలా ఉండగా 29వ తేదీన పాత టైమింగ్స్ ప్రకారమే మెట్రో రైళ్లు నడుపుతామని అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి వరకు నడిపినందుకు మరుసటి రోజు టైమింగ్స్లో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నగరవాసులు ప్రయాణాలకోసం మెట్రో సేవలను వినియోగించుకోవాలని కోరారు.