రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు హుజురాబాద్ లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను గెలిపించాలని తిరుగుతున్నారు. ఇక్కడ గెలుపు మాకు పెద్ద లెక్కేం కాదని చెబుతూనే లెక్కలు వేసుకుని మరీ తిరుగుతున్నారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అధికార పార్టీతోనే అన్ని పనులు అవుతాయని ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కుల సంఘాలను కలుస్తూ వారి పనులు నెరవేర్చడానికి ప్రాధాన్యం ఇష్తున్నారు.
మరోవైపు దళితబంధు పథకంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. దళితులందరికి పథకం వర్తింపజేస్తామని చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఇతర కులా వారు సైతం తమకు కూడా అలాంటి పథకం కావాలని అడగడంతో ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇతర కులాల్లో కూడా ఓటు బ్యాంకు పోకుండా ఉండేందుకు నానా పాట్లు పడుతున్నారు. పద్మశాలి, నాయిబ్రాహ్మణ, రెడ్డి, కాపు, వైశ్య, గౌడ సామాజకవర్గాలను నిరంతరం కలుస్తూ వారి పనులు చేయిస్తామని చెబుతున్నారు. ముదిరాజ్ కులంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి వారి ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నారు.
హుజురాబాద్ లో 2.26 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో దళితులవి 45 వేల వరకు ఉండగా వారికి దళితబంధు పథకం ఇవ్వనున్నారు. దీంతో వారి ఓట్లు మొత్తం గంపగుత్తగా పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక మిగతా కులాల వారిని కూడా ఏకం చేస్తూ వారికి కూడా ఏదో ఒక రూపంలో న్యాయం జరిగేలా చేస్తామని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఫోకస్ మొత్తం ఇక్కడే పెట్టినట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ ను ఓడించాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఎలాగైనా ఇక్కడ ఈటలను ఓడించి తమ పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని కుల సంఘాలను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. ఓటు బ్యాంకు చీలిపోకుంా ఉండాలని చూస్తున్నారు. కానీ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో తెలియని సందిగ్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి.