Huzurabad By Election: తెలంగాణ రాజకీయాలను షేక్ చేసే వార్తను ఈసీ వెల్లడించింది. ఓ వైపు అధికార టీఆర్ఎస్, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్న ఈ సీటును గెలుచుకోవడానికి అందరికంటే ముందే ప్రచారాలు, పథకాలు హుజూరాబాద్ లో హోరెత్తాయి.
తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని సీఎం కేసీఆర్ తన శక్తియుక్తులన్నింటిని హుజూరాబాద్ పై కేంద్రీకరించారు. దళితబంధు సహా పథకాలన్నీ హుజూరాబాద్ లో కుమ్మరించేస్తున్నాడు. ఇక బీజేపీ దండు మొత్తం హుజూరాబాద్ పై ఫోకస్ చేసింది. ఎప్పుడెప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంటుందనే దానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండుగల సీజన్ ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది.
అక్టోబర్ లేదా నవంబర్ లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది. అలాగే ఏపీలోని బద్వేలు ఉప ఎన్నిక కూడా హుజూరాబాద్ తోపాటే దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది.
తాజాగా ఈసీ దేశంలో ఖాళీ అయిన బెంగాల్, ఒడిశా ఉప ఎన్నికల నిర్వహణకు రెడీ అయ్యింది. ఈనెల 30న బెంగాల్ లోని భవానీపూర్, జంగీపూర్, శంషేర్ గంజ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ వెల్లడించింది. అదే రోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా త్వరలో జరుగనున్నట్లు తెలిపింది.