పంజ్ షీర్ మా ఆధీనంలోనే ఉందని తాలిబన్ ప్రతినిధి ఒకరు వెల్లడించడంతో ఈ ప్రకటనను అఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఖండించారు. పంజ్ షీర్ తాలిబన్ల వశం కాలేదని చెబుతున్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అఫ్గనిస్తాన్ జాతీయ తిరుగుబాటు దళం-విదేశీ వ్యవహారాల చీఫ్ నజరీ సైతం తాలిబన్ల ప్రకటనను ఖండించారు. అఫ్గాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలను చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజ్ షీర్ గడ్డపై పైచేయి సాధించాలనే తాలిబన్లు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు తాలిబన్లను పంజ్ షీర్ దళం హతం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు 10 వేల మంది పంజ్ షీర్ ప్రాంతంలో తాలిబన్లతో తలపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటంలో ఎవరిది పైచేయి అన్నది ఇంకా తేలలేదని సమాచారం. ఇంతలోనే తాలిబన్లు పక్కదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారన్నారు.
అయితే తాలిబన్లకు అల్ ఖైదా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదంతో పోరాడుతున్న తమకు మద్దతు లేకపోవడం విచారకరమని వాపోతున్నారు. అఫ్గాన్ లో ఇప్పటికి కూడా తాలిబన్లకు వ్యతిరేకంగానే ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల పాలనలో మహిళల హక్కులు కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ తాలిబన్లు మాత్రం అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు.