Homeజాతీయ వార్తలుషర్మిల పార్టీపై వ్యూహాత్మక అటాక్‌

షర్మిల పార్టీపై వ్యూహాత్మక అటాక్‌

YS Sharmila
తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్లు ఇప్పటికే వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల వారీగా ప్రజాభిసేకరణ చేపట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల. నేడు మరో జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో షర్మిల పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. షర్మిల ప్రకటనపై విభిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Also Read: ట్విట్టర్ పిట్టకన్నా.. గట్టిగ ‘కూ’స్తోంది..

అసలు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి పుట్టగతులుండవు అని ఇప్పటికే పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. షర్మిల ప్రకటనపై తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్‌‌ మేనల్లుడు హరీష్‌ రావు పరోక్షంగా స్పందించడం ఆసక్తి రేపుతోంది. నిన్న ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌లో రైతులకు న్యాయం జ‌రుగుతోందా..? అని ప్రశ్నించారు. అలాగే పేద‌ల‌కు ప‌క్కాగృహాలు వచ్చాయా? అని నిల‌దీశారు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌కు మంత్రి హరీష్‌ చుర‌క‌లు అంటించారు.

మంత్రి హరీష్‌ రావు సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరో వచ్చి తెలంగాణ లో రైతుల‌కు ఏం న్యాయం జ‌రిగింద‌ని ప్రశ్నిస్తున్నార‌న్నారు. ఇక్కడికొచ్చి మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని ష‌ర్మిల‌ను మంత్రి హ‌రీష్ సూటిగా ప్రశ్నించారు. ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ.12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే ఇక్కడ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు.

Also Read: షర్మిల రిటర్న్.. గులాబీ నేతల్లో టెన్షన్..?

అయితే.. హరీష్ ఈ స్థాయిలో స్పందించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలింది. ష‌ర్మిల పూర్తిస్థాయిలో రాజ‌కీయంగా యాక్టివ్ అయితే మాత్రం.. రాజ‌కీయ అల‌జ‌డి సృష్టిస్తుంద‌నే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. రెండో రోజు సైతం లోటస్‌ పాండ్‌ దగ్గర అభిమానుల సందడి నెలకొంది. షర్మిలను కలిసేందుకు పలు జిల్లాల నుంచి అభిమానులు భారీగా వస్తున్నారు. ఇక షర్మిల రెండో రోజు ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో జిల్లాల వారీగా సమీక్షలో మాట్లాడాల్సిన అంశాలపై ముఖ్య నేతలతో మాట్లాడనున్నారు. నల్గొండ జిల్లా నేతల సమావేశంపై పూర్తి రివ్యూ చేయనున్నారు. మార్చి చివరి నాటికి తెలంగాణలోని వైఎస్‌ అభిమానులతో చర్చలు పూర్తి చేయనున్నారు. షర్మిల ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు.. షర్మిల పార్టీ నిర్ణయంపై ఆంధ్ర నేతలు కూడా స్పందిస్తున్నారు. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ వద్దని జగన్ భావించారని.. ఆయన ఆలోచనల ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలని భావించారని.. దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

అయితే.. రాష్ట్రంలో షర్మిల పార్టీ పెడితే లాభమా.. నష్టమా అనే ప్రశ్నలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి. తెలంగాణ వచ్చాక వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు మొత్తం ఏపీకే షిప్ట్ అయ్యాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆ కుటుంబం మళ్లీ తెలంగాణ పాలిటిక్స్‌పై దృష్టి సారించింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడానికి ప్రయత్నిస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు మరో రెండు మూడేళ్ల సమయం ఉండటంతో పక్కా ప్రణాళికతోనే రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీకి షర్మిల సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version