Homeజాతీయ వార్తలుGST 2.0: జీఎస్టీ 2.0.. ధరలు తగ్గేవి ఇవే!

GST 2.0: జీఎస్టీ 2.0.. ధరలు తగ్గేవి ఇవే!

GST 2.0: భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకం ఆవిష్కరించిన ప్రధాని నరేంద్రమోదీ.. భారత ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. దీపావళికి డబుల్‌ ధామాకా ఇస్తామని ప్రకటించారు. జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) విధానంలో కీలక సంస్కరణలను ఈ దీపావళి నాటికి అమలు చేస్తామని తెలిపారు. ఈ సంస్కరణలు సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, మధ్య మరియు చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) ఊరట కలిగించనున్నాయి. ఈ మార్పుల ద్వారా రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గనున్నాయని, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా జీఎస్టీ వ్యవస్థ సరళీకరణ జరుగుతుందని మోదీ సూచించారు.

జీఎస్టీలో ప్రతిపాదిత మార్పులు..
ప్రధానమంత్రి మోదీ ప్రకటన ప్రకారం, జీఎస్టీ విధానంలో ‘‘తదుపరి తరం సంస్కరణలు’’ (జీఎస్టీ 2.0) ఈ దీపావళి నాటికి అమలులోకి వస్తాయి. ప్రస్తుత జీఎస్టీ నిర్మాణంలో ఐదు పన్ను స్లాబ్‌లు (0%, 5%, 12%, 18%, 28%), విలాసవంతమైన, హానికర వస్తువులపై అదనపు సెస్‌ ఉన్నాయి. సంస్కరణలతో స్లాబ్‌లు సరళీకరించనున్నారు. దీంతో ప్రస్తుత 12% స్లాబ్‌ను రద్దు చేసి, ఈ స్లాబ్‌లోని వస్తువులను 5% లేదా 18% స్లాబ్‌లకు బదిలీ చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల జీఎస్టీ నిర్మాణం సరళమవుతుంది. రోజువారీ వినియోగ వస్తువులు, గృహోపకరణాలు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గనున్నాయి. 28% స్లాబ్‌లోని వస్తువులలో 90% వస్తువులు 18% స్లాబ్‌కు, 12% స్లాబ్‌లోని 99% వస్తువులు 5% స్లాబ్‌కు మారే అవకాశం ఉంది. విలాసవంతమైన మరియు హానికర వస్తువులపై విధించే కంపెన్సేషన్‌ సెస్‌ను 40% ఏకరీతి రేటుగా మార్చాలని ప్రతిపాదన. ఇది ప్రస్తుత సెస్‌ రేట్లను (1% నుంచి 290% వరకు) సరళీకరిస్తుంది. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ సమస్యలను పరిష్కరించడానికి ఇన్‌వర్టెడ్‌ డ్యూటీ నిర్మాణాన్ని సరిచేయడం, రిఫండ్‌ ప్రక్రియలను సరళీకరించడం లక్ష్యంగా ఉంది.

ధరలు తగ్గే వస్తువులు ఇవీ..
ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన వస్తువుల జాబితాను పేర్కొనకపోయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం.. కొన్ని రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు, ఇతర గృహ వినియోగ ఉత్పత్తులపై 28% నుంచి 18%కి జీఎస్టీ తగ్గవచ్చు. ఫ్రూట్‌ జ్యూస్‌లు, బటర్, చీజ్, కండెన్స్‌డ్‌ మిల్క్, డ్రై ఫ్రూట్స్, సాసేజ్‌ల వంటి ఉత్పత్తులు 12% లేదా 28% నుంచి 5% లేదా 18% స్లాబ్‌కు మారవచ్చు. మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్, గాజ్, బ్యాండేజ్‌లు, డయాగ్నస్టిక్‌ కిట్‌ల వంటి ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్య, జీవన బీమా ప్రీమియంలపై ప్రస్తుత 18% జీఎస్టీని 12% లేదా 5%కి తగ్గించాలని చర్చలు జరుగుతున్నాయి, దీనివల్ల బీమా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. 10 రూపాయల లోపు ధర ఉన్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు (షాంపూ, సబ్బు వంటి చిన్న సాచెట్‌లు) 5% స్లాబ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: ఒడిశాలో గుట్టల కొద్దీ బంగారం.. ఆర్థిక శక్తికి కొత్త ఊపిరి

ధరల తగ్గింపు ప్రభావం ఇలా..
జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధి, సామాన్య ప్రజల జీవన నాణ్యతపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ధరల తగ్గింపు వల్ల వినియోగం పెరిగి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుంది. లాఫర్‌ కర్వ్‌ సిద్ధాంతం ప్రకారం, తగ్గిన పన్ను రేట్లు ఎక్కువ మందిని జీఎస్టీ వ్యవస్థలోకి తీసుకొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సరళీకృత పన్ను విధానం, తగ్గిన రేట్లు వ్యాపార వ్యయాలను తగ్గిస్తాయి, దీనివల్ల ఈ రంగం బలోపేతమవుతుంది. అయితే పన్ను రేట్ల తగ్గింపు వల్ల ప్రభుత్వ ఆదాయంలో సుమారు 0.15% జీడీపీ నష్టం (500 బిలియన్‌ రూపాయలు) జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దీర్ఘకాలంలో వినియోగం, పన్ను వసూళ్ల పెరుగుదల ఈ నష్టాన్ని భర్తీ చేస్తుందని భావిస్తున్నారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలు
ఈ సంస్కరణలు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రెండు స్లాబ్‌ల విధానం ద్వారా వ్యాపారాలకు నియమ నిబంధనలు సరళమవుతాయి, పన్ను వివాదాలు తగ్గుతాయి. రోజువారీ వస్తువుల ధరల తగ్గింపు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. సెస్‌ రద్దు, రేట్ల సరళీకరణ ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular