Gold Import Duty Hike: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయాలని ఆలోచన పూర్తిగా విరమించుకోవాలని భారతీయులకు సూచించారు. ఆయన మాటలు బంగార పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తిగా నిజమైపోయాయి. ఎందుకంటే కేంద్రం ఒక్కసారిగా గోల్డెన్ స్ట్రోక్ ఇచ్చేసింది. బంగారం కొనుగోలు చేయాలని వారి ఆశలను ఒక్కసారిగా తుంచేసింది.
ఇటీవల హైదరాబాద్ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏడాది పాటు భారతీయులు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. ఆయన మాట్లాడిన రెండు రోజుల్లోనే కేంద్రం బంగారం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతుల మీద సుంకం రెట్టింపు చేసింది. ఇప్పటిదాకా అది ఐదు శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా 10 శాతానికి పెరిగిపోయింది. ఇది మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఆభరణాల తయారీకి వాడే వస్తువులు.. ఇతర లోహాలు.. పారిశ్రామిక దిగుమతులకు కూడా ఇది వర్తిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే బంగారం ధర (24 క్యారెట్లు) 1,40,000 మించి ట్రేడ్ అవుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
బంగారం దిగుమతులు పెరుగుతుండడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ధరలు పెరుగుతున్నప్పటికీ చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మార్కెట్ నిపుణులు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలని సూచనల మీద సూచనలు చేస్తున్న నేపథ్యంలో.. చాలామంది ఇతర రంగాలను పక్కనపెట్టి.. కేవలం బంగారం మీద మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో.. ఇతర రంగాలలో కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆయా రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి అంతగా సాగడం లేదు. అందువల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని తెలుస్తోంది. బంగారం కొనుగోళ్లు ఏడాదిపాటు తగ్గిపోతే మన దేశానికి సంబంధించిన విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.
కేవలం బంగారం, ఇతర ఖరీదైన లోహాలు మాత్రమే కాదు.. ఆహార పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. నాలుగు నెలల క్రితం ఇది 3.48 శాతంగా ఉండేది. జనవరిలో 2.74 శాతంగా ఉండేది. దీనికి ప్రధాన కారణం ఆహార ధరల పెరుగుదలే. వరుసగా ఆలు.. ఉల్లి.. టమాటా ధరలు క్రాష్ అయ్యాయి. మిగతా ఉత్పత్తుల ధరలు పెరిగాయి. దీంతో నాలుగు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం గడిచిన నాలుగు నెలల్లో 2.13 శాతం నుంచి 4.2 శాతం వరకు పెరిగింది. జ్యువెలరీ, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 53.61 శాతానికి చేరుకుంది.