Gaddar- KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్కు కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన కత్తి దూశారు. చివరకు వేటు వేశారు. తనకు కోపం వస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని నిరూపించుకున్నారు.. ఏంటీ పాల్కు కూడా కోపం వస్తుందా.. అది ఎలా ఉంటుంది.. ఎంత కామెడిగా అనిపిస్తుంది… అని ఆలోచిస్తున్నారా? మీ ఆలోచన నిజమే.. పాల్ కోపం కూడా కామెడిగానే ఉంది. మామూలు కామెడీ కాదు మరి. 140 దేశాల అధినేతలతో సంబంధాలు ఉన్న పాల్.. ఇప్పడు తన పార్టీ నుంచి ఓ లీడర్ను సస్పెండ్ చేశాడు మరి.
ఏం జరిగిందంటే..
ప్రజాశాంతి అనే తాను స్థాపించిన పార్టీ నుంచి ఉద్యమనాయకుడుగా ఒకప్పట్లో పెద్ద గుర్తింపు ఉన్న గద్దర్ను బహిష్కరిస్తున్నట్టు కేఏ.పాల్ ప్రకటించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున, బహిష్కరణ వేటు వేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అసలు కేఏ.పాల్ ది ఒక పార్టీ.. దానికి మళ్లీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కూడానా?.. అని పెదవి విరవకండి. ఇదంతా నిజం. తెలంగాణలో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోయేది ప్రజాశాంతి పార్టీ మాత్రమేనని, ముఖ్యమంత్రి కాబోయేది తానేనని కూడా పాల్ చాలాసార్లు ప్రకటించారు.
మునుగోడు ఎన్నికల వేళ..
మునుగోడు ఎన్నికల్లోనే తమ పార్టీ సత్తా చూపిస్తాం అని కూడా ఆయన అప్పట్లో ప్రతిజ్ఞలు చేశారు పాల్. మునుగోడు ఎన్నికలకు ముందుగా.. ‘ప్రజా యుద్ధ నౌక’గా పాత గుర్తింపు ఉన్న ప్రజాగాయకుడు గద్దర్ను ఆయన తన ప్రజాశాంతి పార్టీలో చేర్చుకున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి తరఫున గద్దర్ పోటీచేస్తారని పాల్ ప్రకటించారు. ఆయనకు బీఫారం అందిస్తున్నట్టుగా ఫొటోలు కూడా వచ్చాయి. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఎన్నికల బరిలోకి గద్దర్ అడుగుపెట్టలేదు. పాల్ స్వయంగా నామినేషన్ వేశారు. ఎప్పటిలాగానే తాను గెలిచి తీరుతానని ప్రతిజ్ఞలు చేశారు. మొత్తానికి సదరు మునుగోడు ఉప ఎన్నికలో పాల్ 805 ఓట్లు సాధించారు.
కేసీఆర్ అరాచకాలత ఓడానని..
కేసీఆర్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల్లో పూర్తిగా అరాచకాలకు పాల్పడిందని, తాను గెలవాల్సి ఉండగా, ఎన్నికల అక్రమాల వల్ల ఓడిపోయానని, ఈ ఎన్నికల అక్రమాలపై ఈసీ విచారణ చేయించాలని పాల్ రకరకాల డిమాండ్లు చేశారు. అక్కడితో గద్దర్తో ప్రజాశాంతి అనుబంధం కూడా మరుగున పడిపోయింది. గద్దర్ అసలు ప్రజాశాంతి పార్టీలో చేరారా లేదా అనేది కూడా ఎవ్వరికీ తెలియకుండానే పోయింది. తాజాగా ఈ వ్యవహారం చర్చల్లోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీచేసి ఆయనను ఓడిస్తానని పాల్ స్థాయిలోనే పట్టుదలగా చెబుతున్న గద్దర్.. తాను కొత్త పార్టీ స్థాపించే ప్రయత్నాల్లో ఉన్నారు. బుధవారం ఢిల్లీలో కొత్త పార్టీ స్థాపనకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు.
కొత్త పార్టీ ప్రకటనపై ఆగ్రహం..
గద్దర్ కొత్త పార్టీ స్థాపన ప్రయత్నాల్లో ఉండడం పాల్కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే తన ప్రజాశాంతి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు చేరిక ఎప్పుడు జరిగిందో తెలియకపోయినా. ప్రజలకు ఈ బహిష్కరణ కామెడీ మాత్రం నవ్వు తెప్పిస్తోంది.