YSRCP Foreign Bots: అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ కచ్చితంగా నిరసనలు చేపట్టాలి. ధర్నాలు చేయాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. ఇది ప్రతిపక్ష పార్టీకి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. దీనిని ఎవరూ కాదనడానికి లేదు. కానీ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ అధికార పక్షం మీద విమర్శలు చేయడం.. బలవంతంగా ధర్నాలు చేయడం వంటివి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు ఏపీలో ఇదే పరిస్థితి ఉంది.
2019 ఎన్నికల్లో గెలిచిన వైసిపి.. భారీగా స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. విజయ గర్వం తలకెక్కి వైసిపి అరాచకమైన పరిపాలన చేసింది. నొక్కుడు పథకాలకు ప్రజలను అలవాటు పడేలా చేసి.. ఏపీ రాష్ట్రంలో అభివృద్ధిని తొక్కిపడేసింది. పరిశ్రమలను తన్ని తరిమేసింది. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో తిక్కరేగిన ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే వైసీపీని పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. ప్రజల్లో ఉన్న ఈ ఆగ్రహాన్ని చూసి వైసిపి నేతలు మారాలి. ప్రజలకు అనుకూలంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. కానీ అవి వారికి. ఒంట పట్టడం లేదు. అధికారానికి దూరమయ్యామనే బాధలో ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతే బాగుండు అనే ఆలోచన వారి మదిలో ఉంది. అధినేత నుంచి మొదలుపెడితే దిగువ స్థాయి కార్యకర్తల వరకు ఇదే ధోరణి ఉంది.
తాజాగా వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం మీద సోషల్ మీడియా వేదికగా విషం చిమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిడిపి, బిజెపి, జనసేన నాయకులు వేడుకలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. విదేశాలలో ఉండి ట్విట్టర్ బాట్లు కొనుగోలు చేసి.. #2 years for TDP back stabbing అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తోంది. అయితే ఈ ఖాతాలు మొత్తం విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. పైగా వీరంతా కూడా దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కామెంట్లు చేస్తున్నారు. వైసిపి చేసిన ప్రదర్శనలను.. ఇతర వ్యవహారాలను విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా ఈ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది.. ఈ కథనం రాసే సమయం వరకు అది ఏడవ స్థానంలో ఉంది. తిరుపతిలో కూటమి ప్రభుత్వం మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ట్యాగ్ ఏకంగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ కావడం విశేషం.
గతంలో భారత రాష్ట్ర సమితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇదే తరహాలో విదేశాల నుంచి బాట్లు కొనుగోలు చేసి.. సోషల్ మీడియాలో కృత్రిమ ఉద్యమాలను కొనసాగించేది. ఏదో జరిగిపోతోంది అన్నట్టుగా అపోహలు కల్పించేది. ఇప్పుడు వైసీపీ కూడా గులాబీ పార్టీ తోవను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అది కూడా విదేశాల నుంచి బాట్లు కొనుగోలు చేసి.. విదేశీ ఖాతాల ద్వారా కృత్రిమ ఉద్యమాలను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. ఇటీవల కాలంలో కాక్రోచ్ పార్టీ గురించి జగన్ ప్రస్తావించిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు కాక్రోచ్ జనసేన పార్టీ పేరుతో ఖాతాలు ఓపెన్ చేయడం విశేషం. అందులో జగన్ ఫోటోలు.. వైసిపి పార్టీకి సంబంధించిన వివరాలను పోస్ట్ చేయడం గమనార్హం.

