KCR – Gudivada: తెలంగాణ రాష్ట్ర సమితి దసరా పండుగ సందర్భంగా బీఆర్ఎస్గా మారింది. ఈమేరకు ఎన్నికల సంఘానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పార్టీ పేరు మార్చాలని విన్నవించారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే కార్యచరణ రూపొందిస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో పార్టీని విస్తరించడంపై తెలంగాణ మోడల్ను ఆయా రాష్ట్రాల ప్రజల్లోకి తీసుకెళ్లడంపై గులాబీ బాస్ దృష్టిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అభిమానులు, తమ రాష్ట్రంలో పార్టీ విస్తరించాలనుకుంటున్నవారు ప్రచారం మొదలు పెట్టారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.

గుడివాడలో ఫ్లెక్సీ..
వెలమ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది యువత కేటీఆర్ యూత్ పేరుతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్లో టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్, జాతీయ పార్టీని ప్రారంభించిన కెసీఆర్ కు అభినందనలు తెలియజేసే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో కే సీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్రావు ఫొటోలు ఏర్పాటు చేశారు. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆంధ్రాలో కేసీఆర్ పార్టీకి పెద్దగా ప్రజా ఆదరణ ఉండదు అని తెలిపిన రెండు రోజుల తర్వాత గుడివాడలో ఈ విధంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అందులో వైసీపీ పార్టీకి చెందిన నాయకుల ఫొటోలు ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వెలమ సామాజికవర్గం పనిగా..
గుడివాడ ప్రధాన సెంటర్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఏర్పాటు కావడం అక్కడి వెలమ సామాజికవర్గం వారి పనిగా అనుమానిస్తున్నారు. గుడివాడ పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీని తీసుకువచ్చి వెలమలు అందరూ ఏకతాటిపై నిలబడి స్థానికంగా ఉన్న వెలమ కులస్తుల బలం నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మరొక ముందే ఈ విధంగా కటౌట్లు ఏర్పాటు చేయడంతో కొడాలి నాని వ్యతిరేకులు, వైసీపీలో నానిపై అసంతృప్తితో ఉన్నవారు ఈ పని చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2024 నాటికి జాతీయ పార్టీగా..
జాతీయ పార్టీగా బీఆర్ఎస్కు గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు రావాలి. ఈ క్రమంలో కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు పొందడంపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమలో సామాజిక వర్గాలపై దృష్టిపెట్టారు. ముందుగా పొరుగున ఉన్న ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులను నిలుపడం ద్వారా జాతీయ పార్టీ గుర్తింపు సాధించవచ్చని భావిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరిని నిలిపితే గెలిచే అవకాశం ఉంటుందన్న లెక్కలు కూడా వేస్తున్నారు.

గుడివాడ బరిలో కేసీఆర్..
ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో వెలమ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. కేసీఆర్ కూడా అదే సమాజికవర్గానికి చెందినవారు. అయితే గుడివాడ అంటే నాని.. నాటి అంటే గుడివాడ అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేనతో కలిసి ఏపీలో పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్ కూడా నానిని ఓడించడంపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. నానిని ఓడిస్తే వైసీపీ ఆత్మవిశ్వాసం దెబ్బతీయొచ్చన్న యోజనలో టీడీపీ, జనసేన ఉన్నాయి. వీరికి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. నానిని ఓడించాలంటే.. వెలమ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపితే మేలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరో కాకుండా కేసీఆర్ తానే బీఆర్ఎస్ తరఫున బరిలో దిగితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు వైసీపీని దెబ్బకొట్టడంతోపాటు ఆంధ్రాలో ఒక సీటు గెలుపు ఖాయం అన్న అభిప్రాయం ఆంధ్రాలోని జనసేన నాయకులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి కాకుండా.. గుడివాడ బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.