Homeజాతీయ వార్తలుCongress : తొలి ఓటమి.. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఏమిటీ పరిస్థితి?

Congress : తొలి ఓటమి.. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఏమిటీ పరిస్థితి?

Congress : సరిగ్గా మూడు నెలల క్రితం.. కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హోరాహోరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కర భారతీయ జనతా పార్టీపై విజయం సాధించింది. ఆ ఊపు తో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా మహాలక్ష్మి పేరుతో అక్కడ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఇంకా మిగతా హామీలను కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని మంగళూరు ప్రాంతంలో సోమేశ్వర టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి ఓటమిని రుచి చూసింది.. సరిగ్గా మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన అధికార పార్టీని సోమేశ్వర టౌన్ కార్పొరేషన్ ప్రాంత ఓటర్లు తిరస్కరించడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నది.

కర్ణాటకలోని తీర ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన మంగళూరులో సోమేశ్వర టౌన్ కార్పొరేషన్ లో 23 స్థానాలకు గాను 16 స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. కమ్యూనిస్టులతో కలిసి పార్టీ ఇక్కడ పోటీ చేయగా కేవలం ఏడు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ప్రతిపక్ష బిజెపి 16 స్థానాలు గెలుచుకుని కార్పొరేషన్ పీఠాన్ని అధిరోహించింది. సాధారణంగా స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సహజం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు.. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలిచారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్, నారాయణఖేడ్, పాలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్ని స్థానాల్లో బిజెపి గెలిచింది.

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ప్రాంతంలో సోమేశ్వర కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి గెలవడం పట్ల రకరకాల వ్యాఖ్యానాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేయడం లేదని, కర్ణాటకలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నప్పటికీ ప్రభుత్వపరంగా సత్వర చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే సోమేశ్వర టౌన్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీని ఓటర్లు ఓడించారని అక్కడి మీడియా కోడైకూస్తోంది. ఇక జై భారత్ టీవీలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పెట్టుబడులు పెట్టడం, ఆయనకు సిబిఐ నోటీసులు జారీ చేయడం కూడా తీవ్ర ప్రభావాన్ని చెప్పిందని అక్కడి మీడియా చెబుతోంది.

ఏది ఏమైనప్పటికీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడవక ముందే కాంగ్రెస్ తొలి ఓటమిని చవి చూడడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమేశ్వర టౌన్ కౌన్సిల్లో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని బిజెపి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో సీట్లు సాధిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular