ఖజానా ఖాళీ.. ఉద్యోగులకు జీతాలూ లేవు

ఏ ఉద్యోగి అయినా.. నెలపాటు కష్టపడ్డాక జీతం తీసుకునే టైమ్‌ వచ్చిందంటే ఆ సంతోషం వేరు. జీతం వస్తేనే కానీ ఫ్యామిలీ గడిచేది. అది ప్రభుత్వ ఉద్యోగులైనా.. ప్రైవేటు ఉద్యోగులైనా..! కానీ.. ఏపీలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే దుస్థితి వచ్చింది. మార్చి 31తో పాత ఆర్థిక సంవత్సరం ముగిసి.. ఏప్రిల్‌ ఒకటితో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. కానీ.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రం ఇంకా శుభారంభం కాలేదు. ఫైనాన్షియల్‌ ఇయర్‌‌ ముగిసిన తర్వాత […]

Written By: Srinivas, Updated On : April 4, 2021 10:53 am
Follow us on


ఏ ఉద్యోగి అయినా.. నెలపాటు కష్టపడ్డాక జీతం తీసుకునే టైమ్‌ వచ్చిందంటే ఆ సంతోషం వేరు. జీతం వస్తేనే కానీ ఫ్యామిలీ గడిచేది. అది ప్రభుత్వ ఉద్యోగులైనా.. ప్రైవేటు ఉద్యోగులైనా..! కానీ.. ఏపీలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే దుస్థితి వచ్చింది. మార్చి 31తో పాత ఆర్థిక సంవత్సరం ముగిసి.. ఏప్రిల్‌ ఒకటితో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. కానీ.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రం ఇంకా శుభారంభం కాలేదు. ఫైనాన్షియల్‌ ఇయర్‌‌ ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 1న బ్యాంకులు పనిచేయవు. సరే.. ఒకటో తేదీన కాకుంటే రెండున జీతాలు పడుతాయని అనుకున్నారు. కానీ.. బ్యాంకులకు రెండు నాడు కూడా సెలవులు ప్రకటించారు. ఇక మూడో తేదీన అయినా వస్తాయని ఆశగా ఎదురుచూశారు. కానీ.. రాలేదు.

ఇప్పటికీ ఇంకా జీతాలు రాకపోవడంపై ఆరా తీస్తే.. అసలు జీతాల బిల్లులే ఇంతవరకూ ఆర్బీఐకి ప్రభుత్వం పంపలేదని తెలిసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హతాశులయ్యారు. సాధారణంగా హోమ్ లోన్ల ఈఎంఐలు.. ఇతరత్రా రుణాలు ఈఎంఐలు.. ఐదు నుంచి పదో తేదీ మధ్య ఉండేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ తేదీలోపు జీతాలు.. రాకపోతే బౌన్స్ అవుతుంది. ఇప్పుడు ఉద్యోగులకు అదే టెన్షన్ ప్రారంభమయింది.

ప్రతినెలా 25వ తేదీలోపు జీతాల బిల్లులు సిద్ధమై.. ఆర్బీఐకి పంపిస్తారు. 20వ తేదీ నుంచే ప్రాసెస్‌ ప్రారంభించాలి. అయితే… ప్రాసెస్‌ ప్రారంభించడంలో ఈసారి కూడా ఎక్కడ తేడా లేదు. అన్నీ రెడీ చేశారు. కానీ.. ఫైల్‌ మాత్రం ఆర్బీఐకి పంపలేదు. దీనికి కారణం.. ఖజానాలో డబ్బుల్లేకపోవడమే. మార్చి నెలలో అప్పుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం.. అప్పటికే భారీ ఎత్తున అప్పులు చేసి ఉండటంతో కుదరలేదు. అదే సమయంలో.. ఆర్బీఐ బాండ్ల రుణాల చాన్స్ కూడా అయిపోయింది. మళ్లీ కొత్త ఏడాదిలోనే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అప్పులు చేసి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఏపీలో అప్పుల కోసం ఆర్థిక శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అప్పు లభించగానే జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు సిద్ధపడుతోంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం.. 8వ తేదీ తర్వాతనే జీతాల చెల్లింపు ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు.. కొంత మంది ఉద్యోగ సంఘ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు కాకుండా.. టెక్నికల్ సమస్యలని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పెన్షనర్లకు ఎప్పుడూ ఆలస్యంగానే పెన్షన్ అందుతోంది. గత నెలలో డీఏ బకాయిలు ఇస్తామని మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రకటించారు. కానీ ఇవ్వలేదు.

ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మారిపోయింది. ఇవ్వాలంటే మళ్లీ బిల్లులు పెట్టాలి. ఇంత గడ్డు పరిస్థితి ఉన్నా.. రూ.1100 కోట్ల బిల్లులను సస్పెన్స్ ఖాతా నుంచి చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా కాదని.. ఆ 1100 కోట్లను ఎందుకు సస్పెన్స్ ఖాతాతో చెల్లించాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలే ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సమయానికి జీతాలు, పెన్షన్లు ఇవ్వకపోతే మరింత నెగెటివ్ ప్రచారం జరుగుతుంది. వీటన్నింటి నుంచి ఏపీ సర్కార్‌‌ ఎలా బయటపడుతుందో.. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు అందుతాయో చూడాలి మరి.