ప్రధానంగా చాలా మందిలో జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి వారందరికీ అత్యవసరంగా కొవిడ్ కిట్లను అందించినట్లు చెప్పారు. తద్వారా.. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు. కరోనా లక్షణాలు కనిపించగానే చాలా మంది భయపడి పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నట్టు చెప్పారు. దానివల్ల కూడా.. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని చెప్పారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సిన్లు ఇప్పటి వరకు 57.30 లక్షల డోసులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ 45 ఏళ్ల పై వారికి ఇచ్చారు. ఆ తర్వాత మే 1 నుంచి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ.. ఈ వ్యాక్సినేషన్ నత్త నడకను తలపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం కేంద్రం నుంచి వ్యాక్సిన్ రాకపోవడమేనని తెలంగాణ వైద్యాధికారులు చెబుతున్నారు.
ఈ మధ్యనే కొవాగ్జిన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి వ్యాక్సిన్ అందకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడు అనేది త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్ పరిస్థితి ఇలా ఉన్నందు వల్లనే.. జనాలకు వేయలేకపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రం గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి, అది ఎప్పుడు పూర్తవుతుందో.. రాష్ట్రానికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అన్నది అర్థం కాకుండా ఉంది. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందితే.. కొవిడ్ కల్లోలానికి అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో చూడాల్సి ఉంది.