అధికారికంగా బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం ముగించుకొని ప్రత్యేక విమానంలో ఇవాళ ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్, సీనియర్ నేత వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు మొత్తం 184 మంది ఉన్నారు.
వీరంతా హైదరాబాద్ వచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరి టేకాఫ్ కు సిద్ధమైంది. ఈ సమయంలోనే రన్ వే పై సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని వెంటనే గుర్తించిన పైలెట్ విమానాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. దీంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత నిపుణుల బృందం సమస్యను పరిష్కరించిన తర్వాత విమానం బయలుదేరింది. ఈ ఫ్లైట్ ఉదయం 11.30 గంటల సమయంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగనుంది. అయితే.. అధికారిక చేరిక తర్వాత ఈటలను భారీ ర్యాలీతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళ్లాలని భావించారు. కానీ.. కరోనా నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేవని, ఈ ఆలోచన విరమించుకున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. విమానం దిగిన తర్వాత నేరుగా శామీర్ పేటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఈటలతోపాటు మిగిలిన నాయకులు కూడా ఆయన నివాసానికి చేరుకొని భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నట్టు సమాచారం.
బీజేపీలో చేరిక పూర్తయిన నేపథ్యంలో.. ఇక ఫోకస్ మొత్తం హుజూరాబాద్ మీదనే పెట్టనున్నారు ఈటల. ఈ ఉప ఎన్నిక ఆయన రాజకీయ జీవితానికి ఎంతో ప్రతిష్టాత్మకం అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇందులో గెలిస్తేనే.. ఈటల కెపాసిటీ ఏంటన్నది బీజేపీతోపాటు రాష్ట్రానికి అర్థమవుతుంది. అదే సమయంలో ఈటలను ఓడించడం టీఆర్ఎస్ అత్యవసరంగా మారింది. లేదంటే.. టీఆర్ఎస్ పతనం మొదలైందనే ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. మరి, ఎవరు గెలుస్తారు? ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారు? అన్నది చూడాలి.