Eating Disorders: కరోనా మనకు అనేక జీవిత పాఠాలు నేర్పింది. ఆరోగ్యం, ఫిజికల్ డిస్టెన్స్, హెల్దీ ఫుడ్ విషయంలో చాలా మార్పులకు కరోనా నాంది పలికింది. రెండేళ్లు నేర్పుకున్న పాఠంతో మన లైఫ్స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం పెరిగింది. ఆరోగ్య సూత్రాలు అంతా పాటిస్తున్నాయి. ఇదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతుండడంతో ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్, యోగాను జీవితంలో భాగమవుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఓ సర్వే రిపోర్టు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడికి గురవుతున్న మనిషి టెన్షన్లో పరిమితికి మించి ఆహారం తీసుకుంటున్నట్లు గుర్తించింది. ఇందులో మన హైదరాబాదీలో దేశంలో నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం.

ఇదో మానసిక రుగ్మత..
లైఫ్ స్టైల్లో మార్పు, పని ఒత్తిడి, కరోనా తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల జనం విపరీతమైన మెంటల్ టెన్షన్కు గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా కొందరు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తమను తామే వివిధ రూపాల్లో హింసించుకుంటున్నారు. టెన్షన్ను అదుపులో పెట్టుకునేందుకో లేదా టెన్షన్ కారణంగా విడుదలయ్యే హార్మోన్ల కారణంగానో మరికొందరు అతిగా తినేస్తున్నారని ‘మెంటల్ హెల్త్ సర్వే’ నిర్వహించిన ప్రాక్టో హెల్త్ కేర్ కంపెనీ తేల్చింది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా సర్వే చేసింది.
నాలుగో స్థానంలో హైదరాబాద్..
దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. అతిగా తినే అలవాటును కూడా ఇప్పుడు డిజార్డర్గానే డాక్టర్లు చెబుతున్నారు. దేశంలో ఈటింగ్ డిజార్డర్లో ఢిల్లీ మొదటి స్థానంలో(23%), బెంగుళూరు రెండు(19%), ముంబై మూడు(13%) ఉంటే హైదరాబాద్ 10 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే అతిగా తినే అలవాటు న్న వాళ్ల సంఖ్య 42 శాతానికి పెరిగిందని సర్వేలో పేర్కొన్నారు.
కరోనా తర్వాతా కల్లోలం
కరోనా తర్వాత ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రాక్టో సంస్థ దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరిని వివిధ ప్రశ్నలతో సమాధానాలు సేకరించింది. జనాల మానసిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, వారిలోని ఆందోళన స్థాయి, ఆహారపు అలవాట్ల గురించి అడిగింది. ఆ డేటాను విశ్లేషించి వారి మానసిక స్థితిపై అంచనాకు వచ్చింది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం పడిపోవడం, కుటుంబాలు ఇబ్బందులకు లోనుకావడం, కరోనా పోయి సాధారణ పరిస్థితులు వచ్చాక తిరిగి నార్మల్ లైఫ్ కొనసాగించేటప్పుడు చాలా మంది రకరకాల ఒత్తిడులకు లోనవుతూ వస్తున్నారు. దీని కారణంగా జనంలో సూసైడల్ టెండెన్సీ బాగా పెరిగిందని సర్వేలో గుర్తించారు. అదే సమయంలో సమస్య నుంచి బయట పడాలనుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిందని తేలింది. చాలా మంది కౌన్సెలింగ్ సెంటర్లకు, టోల్ ఫ్రీ కౌన్సెలింగ్కు, సైకాలజిస్టులకు ఫోన్ చేసి సమస్యలు చెప్పుకుంటున్నట్లు వెల్లడైంది.

హార్మోన్ ప్రభావంతోనే..
మెంటల్ డిజార్డర్కి గురవుతూ అతిగా తిండికి అలవాటు పడుతున్న వాళ్లలో 16 నుంచి 82 ఏళ్ల్ల వయసు వరకు ఉన్నారు. 16–34 ఏళ్ల మధ్య వయసువారిలో ఈ డిజాస్టర్ ఎక్కువగా ఉంది. మూడ్ బాగా లేకపోయినా, ఏదైనా ఒత్తిడికి గురైనా, బాధలో ఉన్నా చాలా మంది అవసరానికి మించి తినేస్తుంటారు. దీన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ స్థితి దీర్ఘకాలంగా కొనసాగితే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడికి లోనైనప్పుడు కార్టిసాల్ హార్మోన్ఎక్కువగా విడుదలవుతుందని, దాంతో ఆకలి ఎక్కువైనట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ఉద్వేగానికి లోనయినప్పుడు చాలా మంది ఏదో ఒకటి తినడం ద్వారా భావావేశాలను అదుపులో పెట్టుకోగలమని భావిస్తున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు.
పోస్ట్ ట్రామాటిక్ డిజార్టర్లో 6వ స్థానం
కరోనా, ఇతర ఆరోగ్య సమస్యల తర్వాత వచ్చే సమస్యలను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. ఇందులో హైదరాబాద్ ఆరో స్థానంలో(5%), ఢిల్లీ (23%) మొదటి స్థానంలో ఉండగా తర్వాత ముంబై(18 %), బెంగుళూరు(17%), పుణె (7%), చెన్నై (6%) ఉన్నాయని మెంటల్ హెల్త్సర్వే తేల్చింది. డ్రగ్స్ వాడుతున్న వారిలో ఆందోళన, నిరాశలో ఉన్నవారిలో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది.
అలవాటు మార్చుకునేందుకు ఆసక్తి..
సిటీలో జనంలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు వాటి నుంచి బయటపడాలనే తపన ఉన్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. దేశ జనాభాలో 14% తమ సమస్య పరిష్కారానికి వేరే వాళ్ల జోక్యం అవసరమని భావిస్తున్నారు. సమస్య నుంచి బయటపడేందుకు, అలవాట్లు మార్చుకునేందుకు కుటుంబ సభ్యులను, డాక్టర్లను, కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో కూడా 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలో తేలింది. సర్వే శాంపిళ్లలో 61 శాతం మగవాళ్లు, 39 శాతం ఆడవాళ్లు ఉన్నారని ప్రాక్టో సంస్థ తెలిపింది.