Kangana Ranaut: ఒక్కసారి కాదు వెయ్యి సార్లు ఉద్యోగాలు కోల్పోతా.. కుల్విందర్ ప్రశ్నకు కంగనా వద్ద సమాధానం ఉందా?

కుల్విందర్ అరెస్టు కంటే ముందు శుక్రవారం కంగనా తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. " కొంతమంది ఉగ్రవాదులతో సంబంధాలు నడుపుతున్నారు. వారి భావజానానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 4:36 pm

Kangana Ranaut

Follow us on

Kangana Ranaut: బాలీవుడ్ నటి, మండి పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ను చండీగఢ్ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా కంగన ను చెంప దెబ్బ కొట్టినందుకు ఆమెలో ఏమాత్రం ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కంగనా రచ్చ రచ్చ చేసి.. ఆమెపై సస్పెన్షన్ వేటు పడేలా చేసినప్పటికీ.. కుల్విందర్ మరింత ఘాటుగా స్పందిస్తోంది. శుక్రవారం ఆమెను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా మాట్లాడింది..”ఒకసారి కాదు వెయ్యి సార్లు ఉద్యోగాన్ని కోల్పోవడానికి సిద్ధం. మా అమ్మ గౌరవం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాను.. మా అమ్మకు మించింది నాకు ఏదీ లేదు. నేను ఒక రైతు కూలీ కుటుంబానికి చెందిన యువతిని. అలాంటిది మా కుటుంబాల ఆత్మగౌరవాన్ని హేళన చేసే విధంగా మాట్లాడితే ఎలా ఊరుకుంటామని” కుల్విందర్ ప్రకటించింది.

కుల్విందర్ అరెస్టు కంటే ముందు శుక్రవారం కంగనా తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ” కొంతమంది ఉగ్రవాదులతో సంబంధాలు నడుపుతున్నారు. వారి భావజానానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. గతంలో మన దేశంలో ఉక్కు మహిళగా పేరుపొందిన ఇందిరా గాంధీకి సొంత సెక్యూరిటీ గార్డుల నుంచి ఎటువంటి ప్రమాదం జరిగిందో మనందరం చూసాం. నాకు గడచిన గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో జరిగిన అనుభవం అలానే కనిపిస్తోంది.. వెనుక నుంచి వచ్చి చంప దెబ్బ కొట్టడమే కాకుండా.. వీడియో తీస్తున్న మిగతా వారిని ఆమె అడ్డుకుంది. ఇలాంటి పరిణామాలు మంచివేనా? ఒక భావజాల వ్యాప్తికి అనుగుణంగా పనిచేయడం ఎంతవరకు శ్రేయస్కరమని” కంగన ఆ వీడియోలో ప్రశ్నించింది.

అంతకుముందు కుల్విందర్ ను సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.. ఆమెను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్ట్ కంటే ముందు కుల్విందర్ ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. ” నా అరెస్టు పెద్దగా భయం కలిగించడం లేదు. ఉద్యోగం పోతే పోయింది. మా అమ్మ ఆత్మగౌరవం ముందు ఇలాంటి ఉద్యోగాలు నాకు పెద్ద లెక్క కాదు. వేల ఉద్యోగాలు సైతం పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని” కుల్విందర్ ప్రకటించింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో కుల్విందర్ కు పలు రైతు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై అనుచిత చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు నిరసన చేపట్టాలని సిద్ధమయ్యాయి. నిరసన తెలిపే రోజు పంజాబ్ లోని మొహాలీలో కుల్విందర్ కు న్యాయం చేయాలని ర్యాలీ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటించాయి. ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని పంజాబ్ డిజిపి గౌరవ్ యాదవ్ ను కలుస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ ప్రకటించారు.