PM Modi convoy: దేశంలో అత్యంత పటిష్టమైన భద్రత ఉండేది భారత ప్రధాన మంత్రిగారికే. సాధారణంగా పీఎం కాన్వాయ్లో 12 నుంచి 15 వరకు అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జామర్లు, అంబులెన్స్ వంటివి ఉంటాయి. అయితే, ఇంధన పొదుపు, నిరాడంబరతను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్ ని కేవలం రెండు కార్లకు తగ్గించుకుని సరికొత్త నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రతా నియమాలకు (Blue Book Protocols) ఎలాంటి విఘాతం కలగకుండా.. ప్రస్తుతం ఆయన కాన్వాయ్లో ఒకటి రేంజ్ రోవర్ సెంటినెల్, దానికి రక్షణగా ఒక టొయోటా ఫార్చ్యూనర్ వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. ఈ కార్ల పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం..
రేంజ్ రోవర్ సెంటినెల్ (Range Rover Sentinel):దీనిని కదిలే ఇనుప కోటగా పిలుస్తారు. ప్రధాని మోదీ ప్రయాణించే ఈ కారు సాధారణ రేంజ్ రోవర్ కాదు. ల్యాండ్ రోవర్ సంస్థకు చెందిన ‘స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్’ విభాగం కదిలే బంకర్ తరహాలో ప్రత్యేకంగా తయారుచేసింది. ఈ కారుకు ‘VR8-Level’ బాలిస్టిక్ సర్టిఫికేషన్ ఉంది. అంటే దీనిపై AK-47 రైఫిళ్లతో కాల్పులు జరిపినా, ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్లు దూసుకువచ్చినా లోపల ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగత. కారు కింద లేదా పక్క భాగంలో 15 కిలోల బరువైన టి.ఎన్.టి (TNT) బాంబు పేలినా, గ్రెనేడ్లతో దాడి చేసినా ఇది తట్టుకోగలదు. ఒకవేళ కారుపై విషవాయువులు లేదా కెమికల్ దాడి జరిగితే, బయటి గాలి లోపలికి రాకుండా ఆటోమేటిక్గా క్యాబిన్ లాక్ అయిపోతుంది. ఈ కారు టైర్లు పేలిపోయినా లేదా శత్రువులు కాల్పులు జరిపి పంక్చర్ చేసినా.. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మరో 50 కిలోమీటర్ల దూరం వరకు కారును సురక్షితంగా ముందుకు తీసుకెళ్లవచ్చు.
ఈ కారు బరువు దాదాపు 4.4 టన్నులు . ఇందులో 5.0 లీటర్ల సూపర్ చార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇంత భారీ బరువు, పవర్ఫుల్ ఇంజన్ ఉండటం వల్ల దీని మైలేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది లీటరుకు కేవలం 4 నుంచి 6 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది. ప్రధాని భద్రత కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ కారు ధర సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner): ఎస్పీజీ కమాండోల రక్షణ కవచం
ప్రధాని కారుకు ఎస్కార్ట్గా (వెనుక రక్షణగా) వెళ్లే వాహనమే టొయోటా ఫార్చ్యూనర్. భారతదేశంలో అత్యంత నమ్మకమైన, కఠినమైన రోడ్లపై కూడా సులువుగా దూసుకెళ్లే SUVగా దీనికి పేరుంది. కాన్వాయ్లో ఉండే ఈ ఫార్చ్యూనర్ కారులో ఎస్పీజీ (SPG) కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో ప్రయాణిస్తారు. సాధారణ మార్కెట్లో దొరికే ఫార్చ్యూనర్ లాగా కాకుండా, ఈ భద్రతా వాహనాన్ని కూడా బుల్లెట్ ప్రూఫ్గా మారుస్తారు. ఇందులో హై-టెక్ కమ్యూనికేషన్ గ్యాడ్జెట్లు, శాటిలైట్ కనెక్టివిటీ వ్యవస్థలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని కారుకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా, ఈ ఫార్చ్యూనర్ కారు శత్రువులను అడ్డుకుని రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇది 4-వీల్ డ్రైవ్ (4WD) సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఎలాంటి కఠినమైన దారుల్లోనైనా వేగంగా దూసుకెళ్లగలదు.
ఇందులో శక్తివంతమైన 2.8 లీటర్ల డీజిల్ ఇంజన్ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ మోడిఫికేషన్ల వల్ల దీని బరువు పెరిగినప్పటికీ.. ఇది లీటరుకు సుమారు 7 నుంచి 9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.సాధారణ ఫార్చ్యూనర్ ధర రూ. 40 లక్షల నుంచి రూ.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కానీ ప్రధాని కాన్వాయ్ కోసం చేసే బుల్లెట్ ప్రూఫింగ్, సెక్యూరిటీ మోడిఫికేషన్లు మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వల్ల దీని విలువ రూ.1 కోటికి పైగానే ఉంటుంది.
