అఫ్గాన్ లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరుల కోసం అమెరికా యూకే ప్రత్యేక బలగాలను పంపించారు. కాబుల్ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వీరంతా పహారా కాస్తున్నారు. తాలిబన్ల దారుణాల నుంచి తప్పించుకునేందుకు ఆ దేశ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు సోమవారం ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. దీంతో అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని అప్గాన్ వాసులను అడ్డుకున్నారు. గేట్లు మూసి వేసి ఇనుప కంచెలు అడ్డుపెట్టారు.
వేలాదిమంది అఫ్గానీయులు తమను కాపాడాలంటూ యూకే, యూఎస్ బలగాలను అభ్యర్థిస్తున్నారు. కనీసం పిల్లలనైనా తీసుకెళ్లాలని ప్రాధేయపడుతున్నారు. కొందరు మహిళలు ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు. దీంతో కొందరు పిల్లలు కంచెలో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నందుకు బాధ పడుతున్నారు.
ఇన్ని రోజులు శాంతి మంత్రం జపించిన తాలిబన్ల అసలు స్వరూపం బయటపడుతోంది. శాంతి కాములకులుగా మారామని చెబుతున్నా వారి చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో ఎలాగైనా దేశం విడిచి పోవాలని భావించినా కుదరడం లేదు. దీంతో వారు పెట్టే బాధలను భరిస్తూ అక్కడే కాలం వెళ్లదీయాల్సి వస్తోందని విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో తమకు ఇక చావే దిక్కని నిరంతరం భయంతో బతుకుతున్నారు.