ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రికవరీ కేసుల సంఖ్య తగ్గుతూ.. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య ఎప్పుడో 20 వేలు దాటేసింది. మరణిస్తున్న వారి సంఖ్య కూడా వందకు చేరువైంది.
ఈ పరిస్థితికి అత్యంత ప్రమాదకరమైన N-440K మ్యుటెంటే కారణమని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో.. సమీప రాష్ట్రాలతోపాటు దేశ రాజధాని కూడా అలర్ట్ కావడం గమనార్హం. ఏకంగా.. తెలుగు వాళ్లకు నో-ఎంట్రీ బోర్డు పెట్టేసింది ఢిల్లీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అనుమతి లేకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారెవరూ ఢిల్లీలో అడుగు పెట్టొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
సరిహద్దున ఉన్న తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయట. నిషేధాజ్ఞలు ప్రకటించకుండానే.. సరిహద్దులు మూసేసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి అత్యవసరంగా ఎవరైనా వెళ్లాల్సి వస్తే.. 72 గంటల ముందు చేయించుకున్న కొవిడ్ పరీక్ష రిపోర్టును చూపించాలి. అందులో నెగెటివ్ ఉండాలి. అప్పుడే పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ సర్కారు తేల్చి చెప్పింది.
పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో నామమాత్రపు సమీక్షలు తప్ప, క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన చర్యలు ఏమీ కనిపించట్లేదని అంటున్నారు. కేంద్రం ఇలా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోకపోతే.. ఇక్కడ కూడా అదే దుస్థితి ఎదురవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.