Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి.. సోనం వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్షకు కూడా దిగారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నిరసన చేపడుతున్న నేపథ్యంలో వారికి ఆహారం ఎవరు ఇస్తున్నారు.. ఎవరు ఎక్కడి నుంచి ఆర్డర్ పెడుతున్నారు.. అత్యంత రహస్యంగా వస్తున్న ఆ ప్యాకెట్ల మతలబు ఏంటి.. అనే విషయాలపై జాతీయ మీడియా ఆరా తీసింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు డబ్బులు ఎవరు చెల్లిస్తున్నారు అనే విషయాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జాతీయ మీడియా దీనిపై ప్రసారం చేసిన కథనాల ప్రకారం.. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు భారీగానే ఆహారం వస్తోంది. వారు కోరుకున్నట్టుగానే మెనూ ఉంటున్నది. చోలే బటూరే.. వడ పావ్.. పావ్ బజ్జి.. బిర్యాని.. బర్గర్లు.. పిజ్జాలు రహస్యమైన ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఇస్తున్నారు.
అయితే ఇదంతా కూడా ఆన్లైన్ ఫుడ్ డెలివరీల ద్వారా వస్తోంది. ఇదంతా చేస్తోంది హైదరాబాద్.. ముంబై వాసులు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు చేస్తున్న నిరసనకు మద్దతుగా యువకులు ఈ పని చేస్తున్నారు. వారికి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఫలితంగా దీక్ష శిబిరం వద్ద చాలామంది యువకులు కూర్చుని నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం చర్చలకు వచ్చినప్పటికీ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల డిమాండ్లకు తలవంచే పరిస్థితి లేదని స్పష్టం చేస్తోంది.
నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేసామని.. వారి వెనుక ఉన్న శక్తులను కూడా బయటికి తీసుకొస్తున్నామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి.. వారిని కఠినంగా శిక్షిస్తామని కేంద్రం చెబుతోంది. విద్యార్థులకు న్యాయం చేస్తామని.. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కోరిన గొంతెమ్మ కోరికలను నెరవేర్చాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు మాత్రం పట్టు విడిచేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పోటాపోటీగా ఆందోళనలు చేస్తూ.. కేంద్రం తీరును తీవ్రంగా ఎండ కడుతున్నారు.



