Site icon OkTelugu

Dasoju Sravan: దాసోజు శ్రవణ్‌కి పీఆర్పీ.. జనసేనతో లింక్‌ ఉందా..?

Dasoju Sravan: తెలంగాణ ఉద్యమం ద్వారా రాజకీయల్లో వెలుగులోకి వచ్చిన దాసోజు శ్రవణ్‌కు ఉద్యమకారుడిగా రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. రాజకీయ విషయ పరిజ్ఞానం కూడా దాసోజుకు ఎక్కువే. ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన వాక్‌చాతుర్యమే ఆయనను రాజకీయ నేతగా నిలబెట్టింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన శ్రవణ్‌.. స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్‌ను విభేదించారు. టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌లో చేరి ఎనిమిదేళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించారు. కేసీఆర్‌ విధానాలను ఆయన ఎండగట్టినంతగా ఎవరూ ఎండగట్టలేదంటే అతిశయోక్తి కాదు. కానీ రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చెపట్టిన తర్వాత దాసోజు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. రేవంత్‌ విధానాలు నచ్చలేదని, ముఠాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తర్వాత బీజేపీ గూటికి చేరారు. అక్కడ కూడా సర్దుకుంటున్న సమయంలోనే తన రాజకీయ గురువు, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు తిరిగి సొంతగూటికి వచ్చారు.

Dasoju Sravan

పీఆర్పీతో పొలిటికల్‌ ఎంట్రీ..
దాసోజు శ్రవణ్‌.. తెలంగాణ ఉద్యమకారుడిగా మాత్రమే అందరికీ సుపరిచితం. కానీ ఆయన పొలిటికల్‌ ఎంట్రీ పీఆర్సీతో ప్రారంభమైంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన అప్పటి వరకు ఉన్న పార్టీల విధానాలు నచ్చక ఏ పార్టీలోనూ చేరలేదు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం విధానం నచ్చడంతో ఆ పార్టీలో చేరారు. ప్రజారాజ్యంలో కీలకపాత్ర పోషించారు.

పీఆర్పీ సమైక్యాంధ్ర స్టాండ్‌తో..
అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో.. పీఆర్పీ సమైక్యాంధ్ర స్టాండ్‌ తీసుకోవడంతో శ్రవణ్‌ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌ పార్టీలో చాలా కాలం యాక్టివ్‌గా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో కేసీఆర్‌ శ్రవణ్‌కు టికెట్‌ ఇవ్వలేదు. ఆయన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం లేదని చెప్పి పక్కన పెట్టారు. దీంతో అసంతృప్తికి గురైన ఆయన టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంచి వాగ్దాటి ఉన్న దాసోజు శ్రవణ్‌కు కాంగ్రెస్‌ పార్టీలో గుర్తింపు లభించింది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి టిక్కెట్‌ ఇచ్చారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌ నుంచి పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే సమయంలో దాసోజు శ్రవణ్‌కు టిక్కెట్‌పై పార్టీ పెద్దల నుంచి హామీ లభించలేదు. దీంతో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ఆయన రేవంత్‌పై రాళ్లేసి వెళ్లిపోతున్నారు.

జనసేనానితోనూ అనుబంధం..
రాజకీయ పరిజ్ఞానం, ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడే దాసోజు శ్రవణ్‌కు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తోనూ మంచి అనుబంధమే ఉంది. పీఆర్పీలో పనిచేసిన సమయంలోనే నాడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. పవన్‌ కూడా శ్రవణ్‌ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించారు.

Dasoju Sravan

ఇటీవల శ్రవణ్‌ గురించి ప్రస్తావించిన పవన్‌..
కౌలురైతు పరామర్శ యాత్ర చేపట్టిన జనసేనాని ఇటీవల భీమవరంలో పర్యటించారు. 2009లో తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామన్నారు. బీసీలు రాజ్యాధికారంలో వెనుకబడిపోతున్నారని తాము ఎక్కువ సీట్లు ఇచ్చామని, అది సఫలీకృతం కాకపోయినప్పటికీ ఓ ముందడుగు వేశామన్నారు. కానీ మిగతా వారు ఎవరూ చేయలేదన్నారు. అది గొప్ప ప్రయత్నమని, ఆ ప్రయత్నం వెనుక గొప్ప ఆశయం ఉందన్నారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్‌ గురించి పవన్‌ ప్రస్తావించారు. బీసీలు ఇక్కడకు వచ్చి మాట్లాడుతారని, కానీ గ్రామాల్లోకి వెళ్లాక ఎవరికి వారు విడిపోయి మాట్లాడుతారని చెప్పారు. తన స్నేహితుడు దాసోజు శ్రవణ్‌ అనే విశ్వబ్రాహ్మణ్‌ నేతకు 2009లో పీఆర్పీ నుంచి సికింద్రాబాద్‌ లోకసభ స్థానం కేటాయించామన్నారు. ఆ రోజున అతనికి 1.38 లక్షల ఓట్లు వచ్చాయని, కానీ అక్కడ ఆయన కులం వారు ఎవరూ లేరన్నారు. ఎందుకంటే ఆయనకు అన్ని కులాల వారు ఓటు వేశారన్నారు. అదే దాసోజు శ్రవణ్‌ 2014లో పోటీ చేస్తానని అడిగితే ‘పట్టుమని మీ కులం వాళ్లు ప్రతీ ఊరిలో నలుగురు ఉండరు.. కాబట్టి నీకు సీటు ఇచ్చినా గెలవవు’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారని, దీంతో అతను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడని పవన్‌ తెలిపారు. ఇప్పటికీ శ్రవణ్, పవన్‌ మధ్య కొనసాగుతున్న అనుబంధానికి ఇదే నిదర్శనం.

Exit mobile version