డేంజర్ బెల్: ఆగస్టులో థర్డ్ వేవ్?

అందరూ భయపడ్డదే జరుగబోతోందా? మొదటి వేవ్ ను తట్టుకొని నిలబడ్డ భారతేదేశం.. రెండేవేవ్ కు బలైపోయింది. సెకండ్ వేవ్ కు లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరణ మృదంగం వినిపించింది. శవాలను కాల్చకుండా నదిలో పడేసిన దైన్యం చూశాం. శ్మశానాల వల్ల శవాలు క్యూకట్టిన దృశ్యాలు కనిపించాయి. కోట్ల మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో లక్షల బిల్లులు కట్టేశారు. ఆస్తులు అమ్ముకున్న వారున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు. ఆ విషాదం తాలుకా జ్ఞాపకాలు ఇంకా […]

Written By: NARESH, Updated On : July 5, 2021 5:50 pm
Follow us on

అందరూ భయపడ్డదే జరుగబోతోందా? మొదటి వేవ్ ను తట్టుకొని నిలబడ్డ భారతేదేశం.. రెండేవేవ్ కు బలైపోయింది. సెకండ్ వేవ్ కు లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరణ మృదంగం వినిపించింది. శవాలను కాల్చకుండా నదిలో పడేసిన దైన్యం చూశాం. శ్మశానాల వల్ల శవాలు క్యూకట్టిన దృశ్యాలు కనిపించాయి. కోట్ల మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో లక్షల బిల్లులు కట్టేశారు. ఆస్తులు అమ్ముకున్న వారున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు. ఆ విషాదం తాలుకా జ్ఞాపకాలు ఇంకా చెదరకముందే ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చిపడుతోంది.

కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో వణికిపోయిన భారత్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. అయినప్పటికీ మూడో ముప్పు తప్పదని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు స్ఫష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఆగస్టులోనే థర్డ్ వేవ్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఎస్.బీ.ఐ నివేదిక హెచ్చరించింది. సెప్టెంబర్ నెలలో ఇది గరిష్టానికి చేరుకోవచ్చని అంచనావేసింది.

దేశంలో కరోనా వైరస్ ఉధృతి, బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం వంటి అంశాలపై ఎస్.బీఐ నిపుణుల బృందం అంచనాలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ‘కోవిడ్19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో పరిశోధనాత్మక నివేదికను విడుదల చేసింది.. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉందని నివేదిక హెచ్చరికలు జారీ చేసింది. మే 7వ తేదీన గరిష్టానికి చేరుకున్నట్లు తెలిపింది.

ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే.. జులై రెండో వారానికి రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ ఆగస్టు రెండో పక్షం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.

థర్డ్ వేవ్ లో సెకండ్ వేవ్ కంటే మించి కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని ఎస్.బీ.ఐ నివేదిక అంచనావేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ గరిష్ట కేసులతో పోలిస్తే థర్డ్ వేవ్ గరిష్ట కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ఇప్పటివరకు నమోదవుతున్న గణాంకాల ప్రకారం.. ఆగస్టు రెండో వారం తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. అనంతరం నెలరోజుల్లో గరిష్ట్రానికి చేరుకుంటుందని తెలిపింది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగానే సాగుతోంది. నిత్యం సరాసరి 40 లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇంత వేగంగా వేసినా దేశ జనాభాలో 4.6శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. దేశ జనాభా భారీగా ఉండడమే తక్కువగా వ్యాక్సినేషన్ కావడానికి కారణం.