తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని గత వారం వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీని కోరడం తెలిసిందే.
ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు అనుమతులు ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర వైద్య పరిశోధన మండలి నుంచి సీసీఎంబీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మంగళవారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సిద్ధమవుతోంది.
గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో సీసీఎంబీ సిద్ధమైందని తెలుస్తోంది.
దేశంలోనే అత్యంత పారదర్శకమైన పరిశోధనా సంస్థలో కరోనా పరీక్షలు జరిపితే.. తాత్కాలిక ఉపయోగంతోపాటు పరిశోధనల దిశగా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనంగా వుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచి చెబుతున్నారు.