రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండరుకు నిర్వహించిన ట్రూనాట్ పరీక్షలో ప్రిజంటివ్ పాజిటివ్ వచ్చింది.
తుది నిర్ధారణకు నమూనాను వైరాలజీ ల్యాబ్కి (ఆర్టీపీసీఆర్ పరీక్షకు) పంపారు. అటెండర్ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నాని, ఆయన భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందికి పరీక్షలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో వారందరికీ నెగెటివ్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు. దీంతో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం మంత్రి పెషీకి రాకపోకలు సాగిస్తున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది.