ముంబైలోని వోక్ హార్ట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు, 26 మంది నర్సులకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ ఆసుపత్రిని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సీజ్ చేసింది. వారందరికి టెస్టులు నిర్వహించి నెగెటివ్ వచ్చే దాకా ఎవరూ బయటకు రాకూడదని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. హాస్పిటల్ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఆ దవాఖానకు చెందిన 300 మంది సిబ్బందిని ఇప్పటికే క్వారంటైన్ కు తరలించారు. మార్చి 20న ఇద్దరు కరోనా అనుమానితులను నగరంలోని కస్తూర్భా గాంధీ హాస్పిటల్ నుంచి వోక్హార్ట్ దవాఖానకు తరలించారు. అయితే వారిని సాధారణ ఐసీయూ వార్డులో ఉంచారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వారి బాగోగులను చూసుకుంటున్న ఇద్దరు నర్సులకు మార్చి 28న కరోనా పాజిటివ్ అని తేలింది. క్రమంగా 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లు ఈ వైరస్ బారిన పడ్డారు.