భారత్ లో కరోనా కేసుల సంఖ్య నేటికి లక్ష మార్క్ కి చేరుకుంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 1,01,139 చేరింది. వీరిలో ఇప్పటివరకు 3163 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాదు ప్రపంచంలో కొవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ 11 స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 15లక్షల మంది ఈ మహమ్మారి బారినపడిన విషయం తెలిసిందే. అదే సమయంలో కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య 82,900 గా ఉంది.
గత కొన్ని రోజులుగా భారత్ లో రోజుకు సరాసరి నాలుగువేల పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇలా కేవలం గడచిన పన్నెండు రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ నెల 7వ తేదీన 52వేల పాజిటివ్ కేసులు ఉండగా 19వ తేదీ నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యి లక్ష దాటింది.
భారత్ లో ప్రస్తుతం మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. దీనిలో భాగాంగా నేటినుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తిరిగి తెరచుకోనున్నాయి. అంతేకాకుండా తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు నిబంధనల కొనసాగిస్తూనే ప్రజారవాణాకు పచ్చజెండా ఊపాయి.