ఏపీలో ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ ఉప ఎన్నికలో తామంటే తామే గెలవాలంటూ కత్తులు నూరుతున్నాయి. పోటాపోటీ ప్రచారం సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలో టీడీపీ మాత్రం తన దూకుడు పెంచింది. వారం రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ అక్కడే ఉన్నారు. డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం రేపింది. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ తేలింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి జవహర్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యా రాణిలకు కరోనా తేలింది. కరోనా పాజిటివ్ తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుంచి తప్పుకుని నేరుగా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు.
ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబును కరోనా టెన్షన్ వెంటాడుతోంది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణి గురువారం చంద్రబాబుతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాజిటివ్ తేలిన నేతలతో కాంటాక్ట్ ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరుపతి ఎన్నికల ప్రచారం సందిగ్ధంలో పడింది. ప్రచారంలో పాల్గొన్న మెజార్టీ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో వారంతా హోం ఐసోలేషన్కు చేరుకున్నారు. వారితోపాటు కాంటాక్ట్ అయిన వారందరూ హోం ఐసో లేషన్కు వెళ్లిపోయారు. దీంతో ఇపుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ఎలా అని అందరిలోనూ చర్చకు దారితీసింది.