అయితే.. రాజీనామా చేసి టీఆర్ఎస్ ను సింగిల్ గా ఎదుర్కొని నిలవడం అంత ఈజీ కాదు. ఈ విషయం ఈటలకు సైతం తెలుసు. అందుకే.. ఈ గ్యాప్ లో ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారు. ముఖ్యనేతల చుట్టూ రౌండ్లు వేస్తున్నారు. ఇప్పటికే.. కాంగ్రెస్, బీజేపీ నేతలను కలిసిన ఈటల.. వారి మద్దతు కోరారు. కానీ.. ఆ పార్టీల నుంచి హామీ లభించలేదని సమాచారం. అయితే.. ఈటల విషయంలో కాంగ్రెస్ లో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు తెలుస్తోంది.
ఒక వర్గం ఈటలకు మద్దతు ఇవ్వాలని అంటుండగా.. మరో వర్గం మాత్రం వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వర్గం ఈటలకు అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఇప్పటికే ఈటల – రేవంత్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత.. దేవరయాంజల్ భూముల విషయంలో టీఆర్ఎస్ నేతలు అందరిపై చర్య తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం మాత్రం ఈటలకు వ్యతిరేకంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉత్తమ్ ఈటల విషయంలో అనుకూలంగా కానీ.. వ్యతిరేకంగా గానీ స్పందించలేదు. అయితే.. ఆయన వర్గం మాత్రం ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కౌశిక్ రెడ్డి ఈటలపై దాడి కొనసాగిస్తున్నారు. ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండాలని పట్టుబడుతుండగా.. కౌశిక్ ఉత్తమ్ బంధువు.
ఈ విధంగా ఈటల విషయంలో కాంగ్రెస్ నేతలు రెండుగా చీలారని అంటున్నారు. దీంతో.. ఈటల రాజీనామా చేస్తే.. వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడం జరగకపోవచ్చని అంటున్నారు. అటు బీజేపీ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టకుండా మద్దతు ఇస్తుందా? అన్నది కూడా అనుమానమేనని అంటున్నారు. మరి, ఈ పరిస్థితుల్లో ఈటల ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.