Karnataka Result 2023- Congress: కన్నడలో కాంగ్రెస్ ఆధిక్యం: హైదరాబాద్ లో కీలక పరిణామాలు

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైన రెండు గంటల తర్వాత ట్రెండ్ పై స్పష్టత వచ్చింది. ప్రారంభ ట్రెండులో నువ్వా నేనా అన్నట్టు హోరాహోరి కనిపించినప్పటికీ.. ప్రస్తుతం మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతోంది.

Written By: K.R, Updated On : May 13, 2023 11:40 am

Karnataka Result 2023- Congress

Follow us on

Karnataka Result 2023- Congress: తెలంగాణకు, కర్ణాటక రాష్ట్రానికి మొదటి నుంచి అవినాభావ సంబంధం ఉంది. నిజాం పాలనలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్ర పరిధిలో ఉండేవి.. బళ్లారి నుంచి మొదలు పెడితే గంగావతి వరకు మెజారిటీ ప్రజలు తెలుగు మాట్లాడతారు. అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని అంచనాలు ఉన్నప్పటికీ.. ఏదైనా జరగొచ్చు అనే భావనతో అక్కడి నాయకులు తెలంగాణలో కీలక రాజకీయాలకు తెర లేపారు.

కాంగ్రెస్ కు పట్టం ఖాయమా?

అనుకున్నట్టుగానే కన్నడ ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 114 స్థానాల్లో ముందంజలో ఉంది. బిజెపి 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జెడిఎస్ 24, ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. వాస్తవానికి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక అంచనా వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. ఉదయం11 గంటల వరకే సరైన ట్రెండు కొనసాగడం విశేషం. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా నిస్తేజంగా మారిన పార్టీ కార్యాలయం ప్రస్తుత కన్నడ విజయ సంకేతాలతో కోలాహలంగా మారింది.

అప్పుడే రాజకీయాలు మొదలు

గెలిచే పార్టీపై ఇంకా సంపూర్ణ స్పష్టత రాకపోయినప్పటికీ అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయి. హైదరాబాదులోని ప్రముఖ హోటల్స్ లో రూములు భారీగా బుక్ అయ్యాయి. హోటల్ తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్ లో 20, నోవాటెల్ లో 20 రూములను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు బుక్ చేశారు. మరిన్ని హోటల్స్ లో బల్క్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రగతి రిసార్ట్స్, పేరుపొందిన కొన్ని రిసార్టులలో గదులు బుక్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ రూములు మొత్తం శుక్రవారం ఉదయమే బుక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ గదులు బుక్ చేసిన వారు పార్టీ పేరు చెప్పేందుకు నిరాకరించారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు.

నువ్వా నేనా

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైన రెండు గంటల తర్వాత ట్రెండ్ పై స్పష్టత వచ్చింది. ప్రారంభ ట్రెండులో నువ్వా నేనా అన్నట్టు హోరాహోరి కనిపించినప్పటికీ.. ప్రస్తుతం మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల దాకా కొనసాగుతున్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే కాంగ్రెస్ 114 స్థానాల్లో ముందంజలో ఉంది. బిజెపి 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జెడిఎస్ 24, ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాకముందే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొడుకు యతేంద్ర సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్నే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సాధిస్తుందని స్పష్టం చేశారు. బిజెపి నుంచి అధికారాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు బలపడాలంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని ఆయన స్పష్టం చేయడం విశేషం. ప్రస్తుతం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.