Cockroach Janata Party: దేశ రాజకీయాలలో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద చర్చను తీసుకొచ్చింది ఈ పార్టీ ఇంతవరకు భౌతికంగా ఏర్పాటు కాలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అలజడి సృష్టిస్తోంది. 30 సంవత్సరాల యువకుడు అభిజిత్ దీనికి వ్యవస్థాపకుడు. ఇతడిది మహారాష్ట్రలోని సంభాజీ నగర్. ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో అత్యున్నత చదువులు చదివాడు. ఇంతకుముందు ఇతడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేశాడు. సామాజిక మాధ్యమాల వేదికలలో ప్రజలను ఆకర్షించే విధానాలపై అతడు తీవ్రంగా అధ్యయనం చేశాడు. ఈనెల 16న తన ఎక్స్ ఖాతాలో ఒక మామూలు గూగుల్ ఫారం పెట్టాడు. మీరు సమాజంలో కాక్రోచ్ మాదిరిగా ఇబ్బంది పడుతున్నారా.. వేధింపులు ఎదుర్కొంటున్నారా.. అయితే మీరు రండి.. మనమంతా కలిసి కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేద్దాం.. అంటూ సెటరికల్ గా పిలుపునిచ్చాడు. అది కాస్త సంచలనమై కూర్చుంది.
కేవలం 24 గంటల వ్యవధిలోనే లక్ష మంది ఫాలోవర్స్ పుట్టుకొచ్చారు. 48 గంటల్లో లక్షల మంది ఆ ఫారం మొత్తం నింపేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఆఫీసర్ పేజీ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే విధ్వంసం సృష్టించింది. ఏకంగా భారతీయ జనతా పార్టీని మించిపోయి 1.80 కోట్ల అనుచర గణాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత ఆ పార్టీ అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంటు హ్యాక్ అయింది. దీనికి అనుసంధానంగా అనేక పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే అభిజిత్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్ హ్యాక్ అయిందని పేర్కొన్నాడు. పార్టీని ప్రస్తావిస్తూ వచ్చే ప్రకటనలతో తనకు సంబంధం లేదని ప్రకటించాడు.
అభిజిత్ ఎలాంటి మాటలు మాట్లాడినా సరే.. ఇప్పుడు ఈ పార్టీ విధివిధానాలు ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ పార్టీ తదుపరి లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి. ఎలాంటి విధానాలకు ఆ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. ఇంకా అనేక విషయాలపై చర్చ జరుగుతుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఫాలోవర్స్.. లైకులు.. షేర్ల వరకే ఈ పార్టీ పరిమితం కాబోదని తెలుస్తోంది. వచ్చే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగే శక్తిని ఈ పార్టీ సంతరించుకుంటుందని తెలుస్తోంది.
బీహార్.. ఉత్తర ప్రదేశ్ .. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ఈ పార్టీకి సంబంధించి రీజనల్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు అయ్యాయి. వీటిల్లో ఎక్కువ శాతం యువత ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలుస్తోంది. కేవలం వీరు మాత్రమే కాకుండా టిఎంసి ఎంపీలు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కనిపించేది మొత్తం నిజం కాదు. అదంతా కృత్రిమ ప్రపంచం. అందులో అన్ని కూడా కృతకంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ లైకులు.. షేర్ల ఆధారంగా ఎన్నికల్లో గెలుపులు సాధ్యమవుతాయా.. అంటే చెప్పలేని పరిస్థితి. కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారి.. దేశాన్ని పరిపాలించడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే ఈ పార్టీ ఏర్పాటు పరిపాలకులకు ఒక గట్టి హెచ్చరికను సూచిస్తున్నారు.
