శివరాజ్‌సింగ్‌తో కేసీఆర్‌‌ పర్సనల్‌ భేటీ : ఆంతర్యం ఏంటి..?

ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర భేటీ జరిగింది. ఈ భేటీలో ఏం చర్చించారు.. ఏం నిర్ణయాలు తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌ వచ్చిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అయితే.. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ధ్రువీకరించడం లేదు. తన భార్య వైద్య చికిత్స నిమిత్తం శివరాజ్‌సింగ్‌ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. బేగంపేటలోని ఓ ప్రముఖ హోటల్‌లో […]

Written By: Srinivas, Updated On : January 1, 2021 4:47 pm
Follow us on


ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర భేటీ జరిగింది. ఈ భేటీలో ఏం చర్చించారు.. ఏం నిర్ణయాలు తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌ వచ్చిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అయితే.. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ధ్రువీకరించడం లేదు. తన భార్య వైద్య చికిత్స నిమిత్తం శివరాజ్‌సింగ్‌ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. బేగంపేటలోని ఓ ప్రముఖ హోటల్‌లో బస చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చౌహాన్‌ను కలిశారు.

Also Read: ‘బండి’ వ్యాఖ్యలకు ‘బాలరాజు’ కౌంటర్..!

తాజా రాజకీయాలు, జాతీయ స్థాయి అంశాలు, మధ్యప్రదేశ్‌లో ఇటీవల అధికార మార్పిడి సందర్భంగా తలెత్తిన పరిణామాలు వీరిమధ్య చర్చకు వచ్చాయి. కాగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. దుబ్బాకలో ఓడిపోయాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్‌ నుంచే బీజేపీపై యుద్ధం చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని, టీఆర్‌ఎస్‌ ఆధిక్యం బాగా తగ్గిన తర్వాత డిసెంబరు 11న ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమై వచ్చారు. అదే కోవలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.

కాగా.. శివరాజ్‌సింగ్‌, కేసీఆర్‌ సమావేశంపై తమకు సమాచారం లేనప్పటికీ, రాష్ట్రానికి వచ్చినందున మర్యాదపూర్వకంగా కలిసి ఉండవచ్చని, ఇందులో తప్పేముందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు కొందరు మాట్లాడడం గమనార్హం. మరోవైపు.. కేంద్ర పెద్దలను కలిసి వచ్చాక సీఎం కేసీఆర్‌ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో శివరాజ్‌సింగ్‌తో భేటీ కావటం వేర్వేరుగా చూడలేమనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ‘గ్రేటర్‌’ ఎన్నికలకు ముందు కేంద్ర సర్కారుపై అగ్గి మీద గుగ్గిలమైన కేసీఆర్‌.. ఢిల్లీకి వెళ్లి వచ్చాక శాంతించినట్లు ఆయన నిర్ణయాలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు. ‘వ్యవసాయ బిల్లులను పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. అవి చట్టాలుగా మారాక ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించింది. డిసెంబరు 8న దేశ వ్యాప్త బంద్‌ను స్వాగతించింది. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలందరూ రహదారుల దిగ్బంధంలో భాగస్వాములయ్యారు. ఆ తర్వాతే సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా బీజేపీపై టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేసినప్పటికీ, వాటిల్లో తీవ్రత కనిపించటంలేదు’ అని గుర్తుచేస్తున్నాయి. సాగు చట్టాల అమలుకు రాష్ట్రం సానుకూలంగా ఉన్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు.

Also Read: పోయినేడాది కంటే ఎక్కువే తాగేశారు

కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే, ఆరోగ్యశ్రీ పథకం మెరుగైందని తొలి నుంచి కేసీఆర్‌ వాదించారు. దానిని అమలు చేయడానికి నిరాకరించారు. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలోనూ దానిని అమలు చేయటానికి సుముఖత వ్యక్తంచేశారు. వీటితోపాటు ఈమధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గుతూ వచ్చారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన తర్వాతనే ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. నగరానికి వచ్చిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తన కుటుంబ సభ్యులతో గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తోనూ భేటీ అయ్యారు. ఈ సమావేశం మర్యాదపూర్వకంగానే కొనసాగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్