CM KCR: భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మంది మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వారికే మళ్లీ టికెట్లు కట్టబెట్టారు. తొలి విడత లోనే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. అందులోనూ దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేసి ఆశ్చర్యపరిచారు. అయితే ఇందులో సగం మంది అగ్రకులాల వారే కావడం విశేషం. బీసీలకు 23 సీట్లు మాత్రమే కేటాయించి ఐదో వంతుకే పరిమితం చేశారు. మరోవైపు మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ కేసిఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో నిరసనలు చేపట్టి, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కదిలేలా చేసినప్పటికీ భారత రాష్ట్ర సమితి తాజా జాబితాలో ఏడుగురు మహిళలకు మాత్రమే స్థానం కల్పించి.. ఆరు శాతానికి పరిమితం చేశారు.
పాపం వారిని లెక్క పెట్ట లేదు
ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్ష పార్టీల సహకారం కోరిన కేసీఆర్.. సాధారణ ఎన్నికల్లో వారితో పొత్తు ఉంటుందని ప్రకటించినా.. వారు కోరుకుంటున్న స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి మొండి చేయి చూపారు. ఇక 20 నుంచి 25 మంది భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ లను మారుస్తారని ప్రచారం మొదటినుంచి జరిగింది. పార్టీ తరఫున చేయించిన సర్వేల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు రెండుసార్లు గెలిచినవారు ఉండగా.. మరికొందరు మూడుసార్లు గెలుపొందిన వారు కూడా ఉన్నారు. దీంతో వారిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడటం పాటు రాజకీయంగానూ సొంత పార్టీలోనే వారి పట్ల అసంతృప్తులు, అసమ్మతులు పెరిగిపోయాయి. క్షేత్రస్థాయిలో ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో సిట్టింగ్ల వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. సిట్టింగ్ ల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గడంతో పాటు వారికి సీటు ఇవ్వకుంటే పార్టీ మారతారని ఆందోళన కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం పై సానుకూలత ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్నది కాకుండా ముఖ్యమంత్రిగా తనను చూసి, పార్టీని చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారని ఉద్దేశంతో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
58 మంది వారే
కెసిఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సగం మంది ఓసిలే ఉన్నారు. మొత్తం 115 మంది అభ్యర్థుల్లో 58 మంది ఓసి అభ్యర్థులే. ఇందులో రెడ్డి సామాజిక వర్గం వారు 40 మంది, వెలమ సామాజిక వర్గం వారు 11 మంది, కమ్మ సామాజిక వర్గం వారు ఐదుగురు, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. బీసీల నుంచి 23 మందికి అవకాశం కల్పించారు. అన్ని పార్టీలు బీసీలకు సీట్లు పెంచాలంటూ డిమాండ్లు చేసినప్పటికీ దానిని కేసీఆర్ లెక్కపెట్టలేదు. ఇక టికెట్ల విషయంలో అసంతృప్తులు, అలకలు రాకుండా ఉండేందుకు కేసిఆర్, హరీష్ రావు వారం పది రోజుల నుంచి తీవ్ర కసరత్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జాబితా ప్రకటించిన తర్వాత అసంతృప్తులు బాహాటంగానే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుండగా.. కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వెల్లగక్కారు.